ఎదురెదురు: బాలయ్య తెలంగాణ, హరికృష్ణ సమైక్యాంధ్ర
మరోవైపు, బాలకృష్ణ సోదరుడు, తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ మాత్రం సమైక్యవాదం వినిపిస్తున్నారు. తన శరీరంలో ఎన్టీఆర్ రక్తం ప్రవహించినంత వరకు తాను సమైక్యవాదానికి కట్టుబడి ఉంటానని హరికృష్ణ గతంలో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తెలంగాణ డిమాండ్ను వ్యతిరేకిస్తూ హరికృష్ణ లేఖ కూడా రాశారు. తెలంగాణ డిమాండ్ సరైనది కాదని విమర్శిస్తూ హరికృష్ణ ఆ లేఖలో కెసిఆర్కు సూచించారు.
కొంత కాలం నుంచి పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు పట్ల అసంతృప్తితో ఉన్న హరికృష్ణ సమైక్యవాదానికి కట్టుబడి ఉన్నానని చెబుతుండగా, బాబుకు సన్నిహితంగా ఉన్న బాలకృష్ణ మాత్రం మెల్లగా తెలంగాణ వైపు అడుగులు వేస్తున్నారు. బాలకృష్ణ తెలంగాణ అనుకూల వ్యాఖ్యలపై హరికృష్ణ ఎలాంటి స్పందన వ్యక్తం చేయలేదు. అయితే, హరికృష్ణ స్పష్టంగా సమైక్యవాదానికి కట్టుబడ్డారని పార్టీ వర్గాలంటున్నాయి. చంద్రబాబుతో హరికృష్ణ విభేదాలకు ఇది కూడా ఒక కారణమని అంటున్నారు.
తెలంగాణకు అనుకూలంగా పార్టీ నిర్ణయం తీసుకుంటే సీమాంధ్ర టిడిపి నాయకుల్లో పెద్దగా వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం ఏమీ లేదని సీమాంధ్ర నాయకులు కొంత మంది అంటున్నారు. సంక్షోభంలో ఉన్న పార్టీని గట్టెక్కించే దిశగా మాత్రమే పార్టీలో ఆలోచనలు సాగుతున్నాయని పార్టీకి ప్రయోజనం కలుగుతుందని, పార్టీకి లాభం జరుగుతుందని భావిస్తే తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా, లేఖ ఇచ్చినా పెద్దగా స్పందన ఏమీ ఉండదని అంటున్నారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ గెలిస్తే తెలంగాణ ఏర్పడుతుందని మంత్రులు, లగడపాటి వంటి కాంగ్రెసు నాయకులు ప్రచారం చేసినా సీమాంధ్రలో జగన్ను గెలిపించారని, దీన్ని బట్టి చూస్తే తెలంగాణ అంశం సీమాంధ్రలో పార్టీకి పెద్దగా నష్టం కలిగించేదేమీ ఉండదని తెలుగుదేశం నాయకులు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది.