లగడపాటిలాంటివారికే, బాబు చెప్తారు: కోదండరామ్
తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వైఖరి స్పష్టం చేయాలని తెలంగాణ కోదండరాం డిమాండ్ చేశారు. ఖమ్మంలో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణపై ఏ నిర్ణయమూ ప్రకటించకపోతే కాంగ్రెస్ ఖతమయ్యే పరిస్థితి వస్తుందన్నారు. తాము నిర్వహించనున్న మిలియన్ మార్చ్ ద్వారా తెలంగాణలోని రాజకీయపక్షాలు, ప్రజాసంఘాలు, వివిధ ఉద్యమశక్తులను మరింతగా ఐక్యం చేసి తెలంగాణ సాధించే దిశగా పోరాటాన్ని ఉదృతం చేయబోతున్నామని ఆయన చెప్పారు.
తమ పోరాటం ద్వారా కాంగ్రెస్పై మరింత ఒత్తిడి పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ విషయంలో తెలుగుదేశం కూడా స్పష్టమైన వైఖరి ప్రకటించబోతోందని, ఇక కాంగ్రెసే తన నిర్ణయాన్ని స్పష్టంచేయాలని ఆయన అన్నారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో తెలంగాణ ఉద్యమాన్ని మరోసారి ఉధృతంగా నిర్వహించేందుకు కార్యచరణ రూపొందించామని తెలిపారు.ఈ మిలియన్ మార్చ్ ద్వారా ఆయా జిల్లాల స్థానిక సమస్యలను కూడా తెలియజేస్తామని చెప్పారు.
ముఖ్యమంత్రి ఇందిరమ్మ బాటలో జిల్లాకు సంబంధించిన వాటిపై హామీలు పెద్దగా ఇవ్వలేదని ఆయన అన్నారు. ఇక్కడ బొగ్గు పెద్ద ఎత్తున లభిస్తున్నప్పటికీ విద్యుత్తు ప్రాజెక్టు నిర్మాణంపై హామీనివ్వలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణలోని గిరిజన గ్రామాలు ముంపునకు గురవుతున్నాయని, ఈ ముంపు నుంచి గిరిజనులకు నష్టం లేకుండా ప్రభుత్వం చేపడుతున్న చర్యలు స్పష్టం చేయలేదని చెప్పారు.
మీడియా సమావేశంలో న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు, జేఏసీ నాయకులు రంగరాజు, వెంకటపతిరాజు, జాన్మియా, బీజెపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.