ముగిసిన డెడ్లైన్: ఇక కెసిఆర్ ఏం చేస్తారు?
కేంద్రం సంకేతాల విషయంలో కెసిఆర్ది అబద్ధమైపోయి ఆయన ప్రత్యర్థులది నిజమైంది. నిజానికి, తెలంగాణ ప్రజలకు కూడా కేంద్రం గానీ, కాంగ్రెసు అధిష్టానం గానీ తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేస్తుందనే నమ్మకం లేదు. కెసిఆర్ ఎంతగా చెప్పినా ఆ మాటలను ప్రజలు నమ్మలేదు. తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ కూడా వ్యంగ్యంగా కెసిఆర్ మాటలను తోసిపుచ్చారు. తమకైతే ఏ విధమైన సంకేతాలు రాలేదని ఆయన అన్నారు.
కేంద్రం ఆగస్టు 20 తేదీలోగా తెలంగాణపై ప్రకటన చేయకపోతే ఉగ్రరూపం దాలుస్తామని, తమ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. కానీ, ఆయన ఇప్పుడే ఏమీ మాట్లాడడం లేదు. ఆయన ఏ విధంగా ఉగ్రరూపం దాలుస్తారనేది ఎవరికీ అంతు పట్టడం లేదు. దీనిపై తెరాస నాయకులు కూడా ఏమీ మాట్లాడడం లేదు. తెరాస శాసనసభ్యులు, నాయకులు తాజాగా కరెంట్ కోతలపై ఆందోళనకు శ్రీకారం చుట్టారు. మంగళవారంనాడు వారు విద్యుత్ సౌధాలోని ఆరో ఆంతస్థులో ఇద్దరు శాసనసభ్యులు తమను తాము నిర్బంధించుకుని ఆందోళన చేశారు. వారిని బలగాలు తాళ్ల సాయంతో లోనికి వెళ్లి బయటకు తీసుకుని వచ్చారు. మిగతా నాయకులు బొల్లారం పోలీసు స్టేషన్లో వంటావార్పూ చేస్తూ ధర్నా చేస్తున్నారు.
తెలంగాణ ప్రాంత సమస్యలపై ఆందోళనలకు తెరాస శ్రీకారం చుట్టిందని అనుకోవాలి. అయితే, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ ఏం చేస్తారనేది మాత్రం తేలడం లేదు. సిపిఐ, బిజెపి వంటి పార్టీలు ఇప్పటికే ఆందోళనా కార్యక్రమాలు ప్రకటించాయి. తెలంగాణ జెఎసి సెప్టెంబర్ 30వ తేదీన తెలంగాణ మార్చ్కు పిలుపునిచ్చింది. తెలంగాణపై మిగతా శక్తులు ఆందోళనలకు శ్రీకారం చుడుతుంటే కెసిఆర్ ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. అయితే, కేంద్రం తెలంగాణపై సానుకూలమైన నిర్ణయం తీసుకుంటుందనే గట్టి విశ్వాసమే కెసిఆర్కు ఉన్నట్లు చెబుతున్నారు.