మంత్రులకు కిరణ్ ఝలక్: ఢిల్లీ పేరుతో 'జగన్నా'టకం
ఈ కేసులు మంత్రులకు చుట్టుకుంటున్నాయని, ఇలా అయితే పార్టీకి నష్టమని, జగన్ కేసుకు మంత్రులు కూడా బాధ్యులు అనే వాదన ప్రజల్లోకి మరింతగా వెళితే 2014 ఎన్నికలలో పార్టీ తీవ్రంగా దెబ్బ తింటుందని, మంత్రులుగా తాము తమ బాధ్యతలు మాత్రమే నిర్వర్తించామని, తెర వెనుక జరిగే లాలూచీలకు తాము బాధ్యులు కామని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లే విధంగా చూడాలని, అలాగే ధర్మాన రాజీనామాను ఆమోదించవద్దని, జైలులో ఉన్న మోపిదేవికి కూడా అండగా నిలబడాలని వారు కిరణ్ను కోరారు.
అయితే వారి విజ్ఞప్తికి ముఖ్యమంత్రి నుండి సానుకూల స్పందన రాలేదని అంటున్నారు. కేవలం చూద్దాం చేద్దాం అని మాత్రమే అన్నారని, కానీ ధర్మాన రాజీనామాను తిరస్కరించే విషయంలో ఎలాంటి హామీ ఇవ్వలేదని అంటున్నారు. అందుకు ఆయన ఢిల్లీ పేరును ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. అధిష్టానం నిర్ణయాన్ని బట్టి తాను నడుచుకుంటానని కిరణ్ చెప్పారని తెలుస్తోంది. దీంతో మంత్రులు కిరణ్ తీరుపై అసంతృప్తితో వెనుదిరిగినట్లుగా వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
యుపిఏ-2 భారీ కుంభకోణాలలో కూరుకుపోయింది. విపక్షాల నుండి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత పార్టీ నేతలపై కాంగ్రెసు పెద్దలు చర్యలు తీసుకుంటూ వస్తున్నారు. ఇందుకు ఎపిలో కూడా మినహాయింపు ఉండదని భావిస్తున్నారు. మోపిదేవి వెంకటరమణ రాజీనామా, ఆయన జైలుకు వెళ్లడం అందులో భాగమే. ఇప్పుడు ధర్మాన కూడా కష్టాల్లో కూరుకు పోయారు. పలు రాష్ట్రాలలో సొంత పార్టీ నేతలను వదలని కాంగ్రెసు పెద్దలు రాష్ట్రంలో కూడా అవినీతి మరక అంటించుకున్న మంత్రులపై వేటు వేసే అవకాశాలు కొట్టి పారేయలేం.
ధర్మాన అంశం ఢిల్లీ వరకు వెళితే అధిష్టానం ఆయనను తప్పించాలని ముఖ్యమంత్రికి సూచించే అవకాశాలే ఎక్కువ. ధర్మాన మాత్రమే కాకుండా తమ వరకూ ఇది రావచ్చుననే ఆందోళన పలువురు మంత్రులలో ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి విషయాలను ఇక్కడే తేల్చుకోవాలని వారు భావించి ముఖ్యమంత్రిని కలిశారు. కానీ ఆయన మాత్రం అధిష్టానం పేరు చెప్పి తప్పించుకుంటున్నారని అంటున్నారు. అయితే తమకు మనో నిబ్బరాన్ని ఇవ్వవలసిన ముఖ్యమంత్రి ఇలా వ్యవహరించడమేమిటని మంత్రులు ఆవేదన చెందుతున్నారట. తమ ఒత్తిడి ఫలించలేదని వారు భావిస్తున్నారని అంటున్నారు.