చిరంజీవి నోట బిసి మాట, నోకామెంట్... ధర్మానపై బొత్స
ఈ నివేదికకు చట్టబద్దత కల్పిస్తే ఎస్సీ, ఎస్టీల జీవన ప్రమాణాలు పెరుగుతాయన్నారు. బిసిలకు కూడా ఉప ప్రణాళిక తీసుకు రావాలని, దాంతో పాటే చట్టసభల్లో బిసిలకు అత్యధిక సీట్లు కేటాయించే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని చిరంజీవి విజ్ఞప్తి చేశారు. కాగా ఇటీవల తెలుగుదేశం పార్టీ బిసి డిక్లరేషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అనంతరం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా బిసిలకు వంద సీట్లు ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో చిరంజీవి వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
మంత్రి ధర్మాన ప్రసాద రావు రాజీనామాపై తాను ఏమీ మాట్లాడనని, ఆ వ్యవహారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చూసుకుంటారని ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆదివారం విజయనగరం జిల్లాలో అన్నారు. ప్రస్తుతం విద్యుత్ కోతలు కాస్త తగ్గుముఖం పట్టాయని, త్వరలో పరిస్థితిని మరింత మెరుగు పరుస్తామని చెప్పారు. ఆర్టీసి రూ.206 కోట్ల నష్టాలలో ఉందని, దీనిని అధిగమించేలా కృషి చేస్తామన్నారు. ఫీజు రీయింబర్సుమెంట్సుకు కళాశాలల యాజమాన్యాలు సహకరించాలని, వారితో చర్చిస్తామన్నారు.