తాడోపేడో: సోనియాను కలిశాకే నిర్ణయం... రాయపాటి
కాగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గిరిని పార్టీ అధిష్టానం మరోసారి కనుమూరి బాపిరాజుకు కట్టబెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఎన్నో ఏళ్లుగా పార్టీలో ప్రాధాన్యత కోసం తపిస్తున్న రాయపాటికి మరోసారి చేదు అనుభవం ఎదురయింది. టిటిడి చైర్మన్ పదవి రేసులో ఆయన పేరు పలుమార్లు వినిపించింది. చివరి నిమిషంలో వేరే వాళ్లకు అది వస్తోంది. గతంలో కూడా రాయపాటి పేరు ప్రధానంగా వినిపించింది. కానీ కనుమూరికి అప్పుడు పట్టం గట్టారు.
అప్పుడే కాంగ్రెసు పార్టీ పైన రాయపాటి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే సోనియా గాంధీ అతనితో మాట్లాడాక కూల్ అయ్యారు. అయితే వచ్చేసారి పదవి ఇస్తానని హామీ ఇచ్చినట్లుగా వార్తలు వచ్చాయి. అందువల్లే రాయపాటి మౌనం వహించారని అంటున్నారు. కానీ సోనియా హామీ ఇచ్చినప్పటికీ ఈసారి కూడా పదవి రాకపోవడంపై ఆయన తీవ్ర ఆగ్రహంతోనూ, అవమానంగానూ ఫీల్ అవుతున్నారట. అందుకే శనివారం రాత్రి నుండి ఆయన అజ్ఞాతంలో ఉండిపోయారనే వార్తలు వచ్చాయి.
కాగా పార్టీలో తనకు పదవులు రాకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రాయపాటి ఆదివారం తన కార్యకర్తలతో భేటీ అయ్యారు. రాయపాటి, ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్ వేర్వేరుగా కార్యకర్తలతో భేటీ అయి వారి అభిప్రాయాలను తీసుకున్నట్లుగా సమాచారం. రాయపాటి త్వరలో సోనియాను కలిసే అవకాశముంది.