గాలి బెయిల్: నాగ మారుతీశర్మకు రూ. 40 కోట్లు ఆఫర్

ఈ మేరకు ఆయన ఈ నెల రెండున సికింద్రాబాద్లోని రెండో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. మే 11న గాలికి బెయిల్ మంజూరు కాగా ఇందులోని గుట్టును సిబిఐ రట్టు చేసింది. ఈ బెయిల్ స్కాంలో అరెస్టయిన నిందితుల విచారణలో నాగమారుతీ శర్మ పేరు కూడా వినిపించింది. ఆయనకు కూడా ముడుపులు ఇవ్వజూపినట్లు నిందితులు తెలపడంతో దర్యాప్తు అధికారులు నాగమారుతీ శర్మ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.
దీని ప్రకారం 2011 ఏప్రిల్లో సీబీఐ కోర్టు ప్రత్యేక జడ్జిగా వచ్చిన తన వద్దకు ఆర్సీ నెంబర్-7(ఏ)/2009 పెండింగ్ కేసు వచ్చిందని వివరించారు. "ఈ కేసులో నిందితుడు గాలి జనార్థన్రెడ్డి. ఏప్రిల్ మూడో వారంలో అప్పటి హైకోర్టు రిజిస్ట్రార్ కె. లక్ష్మీనరసింహారావు ఫోను చేసి తనను కలుస్తానన్నారని, తన కన్నా సీనియర్ జడ్జి, రిజిస్ట్రార్ కూడా అయినందున తానే వచ్చి కలుస్తానని చెప్పానని, ఆయన తన ఇంటి అడ్రస్ చెప్పారని నాగమారుతీ శర్మ వివరించారు.
సరిగా గుర్తుకు లేదు కానీ ఏప్రిల్ 18, 2012న అనుకుంటా.. ఆ రోజు ఉదయం లక్ష్మీనరసింహారావు ఇంటికి వెళ్లానని, మాటల మధ్యలో గాలి జనార్థన్రెడ్డి బెయిల్ విషయం ప్రస్తావనకు వచ్చిందని, గాలికి బెయిల్ మంజూరు చేయాలని లక్ష్మీనరసింహారావు ప్రతిపాదన తెచ్చారని, తాను దాన్ని తోసిపుచ్చానని, న్యాయ మార్గాన్ని వదలడం నాకు మరణంతో సమానమని చెప్పానని ఆయన తన వాంగ్మూలంలో వివరించారు.
రూ.40కోట్లు ఇచ్చేందుకు గాలి వర్గం సిద్ధంగా ఉన్నట్లు లక్ష్మీనరసింహారావు చెప్పారని, అయినప్పటికీ తాను గుడ్డిగా ఆ ప్రతిపాదనను తిరస్కరించి ఆయన ఇంటి నుంచి బయటకొచ్చేశానని, కేవలం సీనియర్ జడ్జి అన్న గౌరవంతోనే లక్ష్మీనరసింహారావు ఇంటికెళ్లానని, హైకోర్టు రిజిస్ట్రార్ కూడా అయినందున ఏదైనా కేసు గురించి సమాచారం అవసరముంటే పిలిచారని భావించానని నాగమారుతీ శర్మ వాంగ్మూలం ఇచ్చారు.












Click it and Unblock the Notifications