రెస్క్యూ హోమ్పై దాడి, నలుగురు అమ్మాయిల కిడ్నాప్
రామంతపూర్లోని ఉజ్వల రెస్క్యూ హోమ్పై ఆ దాడి జరిగింది. బంగ్లాదేశ్కు చెందిన ఓ అమ్మాయిని, కోల్కత్తాకు చెందన ఇద్దరు అమ్మాయిలను, ముంబైకి చెందిన ఓ అమ్మాయిని దుండగులు ఎత్తుకెళ్లారు. అయితే, అమ్మాయిల బంధువులే దాడి చేసి వారిని తీసుకుని వెళ్లి ఉంటారని మొదట అనుమానాలు వ్యక్తం చేశారు. మహిళా సంఘాలు రంగంలోకి దిగడంతో సంఘటన మలుపు తిరిగింది.
దాదాపు అరగంట పాటు దుండగులు రెస్క్యూ హోమ్లో బీభత్సం సృష్టించారు. దీంతో అందులోని అమ్మాయిలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. అపహరణకు గురైన నలుగురు అమ్మాయిలను నెలన్నర క్రితం రెస్క్యూ హోమ్కు తరలించినట్లు తెలుస్తోంది. సెక్స్ రాకెట్ బ్రోకర్లే దాడికి దిగారని మహిళా సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రెస్క్యూ హోమ్ నిర్వాహకుడు కూడా వ్యభిచారం నిర్వహిస్తున్నాడని వారు ఆరోపించారు.
రెస్క్యూ హోమ్లో 15 మంది యువతులు ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే తనకు ఏ విధమైన సంబంధం లేదని, తనపై వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని సత్యనారాయణ రెడ్డి చెబుతున్నాడు. అతన్ని మహిళలు కొట్టారు కూడా. సంఘటనపై మంత్రి సునీతా లక్ష్మారెడ్డి స్పందించారు. సంఘటనపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆమె మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు.