జగన్ పార్టీ బిజీ: జెసి, నాలుగు పీకితే చెప్తాడు... విహెచ్
ఈ సమయంలో వారు పలకరించుకున్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డిని ఉద్దేశించి గాదె... వైయస్ అభిమానమే మీ పార్టీకి అండ అని, అలా కాకుండా ఇదంతా తన ప్రభావమేనని, తాను ఎవరిని నిలబెట్టినా గెలుస్తానని జగన్ అనుకుంటే నష్టపోతాడని చెప్పారు. అందుకు స్పందించిన బాజిరెడ్డి... జగన్ అలా అనుకోవడం లేదని, వైయస్ ఆలోచనలతోనే వెళుతున్నారని చెప్పారు. సహనం, వ్యక్తులను అంచనా వేయడం, విశ్వసనీయ, దూరదృష్టి ఉంటేనే నాయకుడిగా ఎదగగలడని తాను గతంలోనే జగన్కు చెప్పానని గాదె అన్నారు.
వైయస్ అంటే విశ్వాసం ఉన్న వారే కాకుండా ఆయనను తిట్టిన వారు, కాంగ్రెసులో టిక్కెట్ రాదన్నవారు, గెలవలేని వారే జగన్ పార్టీలోకి వెళుతున్నారని అన్నారు. జెసిని కూడా బాజిరెడ్డి పలకరించారు. జెసి మాట్లాడుతూ... మీరంతా బిజీ కదా సార్, ఇప్పుడు మీపై వేరే పార్టీల నుంచి వస్తామంటున్న వాళ్లు ఎక్కువగా ఉన్నట్టుంది కదా అని, ఇది మీకు వ్యక్తిగతంగా నష్టం చేయదు కదా అన్నారు. దీనికి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని, ప్రాణాలనూ పణంగా పెట్టి తానీ స్థాయికి చేరానని బాజిరెడ్డి అందుకు సమాధానమిచ్చారు.
కాగా రాష్ట్రంలో అధికార పార్టీని రక్షించుకోవడానికి సేవ్ కాంగ్రెస్ పేరిట కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వి హనుమంత రావు చిత్తూరు జిల్లా తిరుపతిలో చెప్పారు. 2014 ఎన్నికలలో రాష్ట్రంలో కాంగ్రెసు మరలా అధికారంలోకి తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. మంత్రులు, అధికారులు జైలుకు పోతుంటే కూడా జగన్ స్పందించడం లేదని, అక్రమాస్తులు కనిపిస్తున్నా తప్పు చేయలేదంటే ఎలా అన్నారు. బెంగళూరు, హైదరాబాదులలో పెద్ద భవంతులు, ఆయన కంపెనీలలోకి పెట్టుబడులు ఎక్కడ నుండి వచ్చాయో జగన్ చెప్పాలని, సౌమ్యంగా చెబితే జగన్ నిజాలు చెప్పడని, నాలుగు పీకితే తప్ప ఫలితం ఉండదన్నారు.