జగన్ బాధ్యత స్వీకరిస్తారు, ఆ రెండు ఖాళీ: మేకపాటి
కాంగ్రెసు, టిడిపిలపై ప్రజలకు నమ్మకం పోయిందని, త్వరలో ఆ పార్టీ ఖాళీ కావడం ఖాయమన్నారు. వైయస్ మరణం తర్వాత రాష్ట్రం అనాథ అయిందని, అన్ని రకాలుగా ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. వైయస్ జగన్ త్వరలో బయటకు వస్తారని, ప్రజల సారథిగా బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి హనుమంత రావు గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిందని మరో నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అన్నారు. విహెచ్ను ప్రజలు చెప్పుతో కొట్టే రోజు తప్పకుండా వస్తుందన్నారు. తన తండ్రికి నివాళులు అర్పించే అవకాశం జగన్కు లేక పోయిందని బాజిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు వైయస్ కుటుంబ సభ్యులు కడప జిల్లాలోని ఇడుపులపాయలో వైయస్ సమాధి వద్ద నివాళులు అర్పించారు. వైయస్ విజయమ్మ, వైయస్ భారతి, షర్మిల, వైయస్ వివేకానంద రెడ్డి, బ్రదర్ అనిల్ కుమార్, మనోహర్ రెడ్డి, కొండారెడ్డి తదితర కుటుంబ సభ్యులు ప్రార్థనలు నిర్వహించారు. వైవి సుబ్బారెడ్డి, మైసూరా రెడ్డి, మాజీ మంత్రి మారెప్ప తదితరులు హైదరాబాద్ నుండి పావురాలగుట్టకు వెళుతూ కర్నూలులో వైయస్ విగ్రహానికి పూలమాల వేశారు.
అనంతపురం జిల్లాలో సప్తగిరి సర్కిల్లో ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి తదితరులు వైయస్ విగ్రహానికి అంజలి ఘటించారు. ఇదే సమయంలో ఫీజు రీయింబర్సుమెంట్సులో అన్యాయం జరుగుతోందని వైయస్సార్ విగ్రహం వద్ద పలువురు విద్యార్థులు ఆందోళనకు దిగారు. వైయస్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ప్రభుత్వం తిలోదకాలిచ్చిందని మండిపడ్డారు.