రూ60 కోట్లుగా చూపి 16 కోట్లు బ్యాంకుకు కుచ్చు టోపీ
వ్యాపారాభివృద్ధి పేరుతో డిజిటల్ పిసి టెక్నాలజీస్(డిపిటి) అనే సంస్థ ఎస్బిఐని రూ.15కోట్ల రుణం కోరింది. ఆ సంస్థ మేనేజర్ కిషోర్బాబు(ఎ1), ఎండి విజయ్ కుమార్ చాణక్య, జిఎం(ఫైనాన్స్) వీర వెంకట సత్యనారాయణ మూర్తి 2009లో బ్యాంకును సంప్రదించారు. రుణానికి పూచీకత్తుగా సంస్థకు చెందిన స్థిరాస్తి పత్రాలను అందజేశారు. వాటి విలువ రూ.60 కోట్లని నమ్మబలికి రుణం పొందారు. వాయిదాలు సరిగా కట్టకపోవడంతో బ్యాంకు ఒత్తిడి పెంచింది. కొంతకాలం తర్వాత ఓ కోటి రూపాయల చెక్కు ఇచ్చారు. కానీ అది చెల్లలేదు.
ఈ లోగా తీసుకున్న రుణం కాస్తా వడ్డీతో కలిపి రూ.16కోట్లు దాటింది. దీంతో తనఖా పెట్టిన పత్రాలపై బ్యాంకు అధికారులు దృష్టి సారించడంతో వారికి దిమ్మ తిరిగింది. సంస్థ స్థిరాస్తుల విలువ రూ.5.35 కోట్ల కంటే ఎక్కువుండదని నిర్ధారించారు. పోనీ వాటిని స్వాధీనం చేసుకుందామనుకున్నా ఆ పత్రాలు నకిలీవని తేలింది. ఇక బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు చెన్నైలోని సిబిఐ ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేపట్టింది. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది.
డిపిటి ఆస్తి పత్రాలను చూపి మరికొన్ని సంస్థల నుంచి కూడా నిందితులు డబ్బు కాజేశారని దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను ఎట్టకేలకు అరెస్టు చేసి సిబిఐ కోర్టులో ప్రవే శపెట్టారు. ప్రణాళిక ప్రకారం మోసాలకు పాల్పడిన నిందితులను వారం రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరింది. దీనిపై విచారణను జడ్జి సోమవారానికి వాయిదా వేశారు. కాగా, ఈ వ్యవహారంలో బ్యాంకు అధికారుల పాత్రపైనా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇప్పటికే కోఠి ఎస్బిఐ బ్యాంకు నుంచి సుమారు రూ. 70కోట్ల విలువైన 250కిలోల బంగారం తీసుకుని చేతులెత్తేసిన రుణ గ్రహీతపై నమోదైన కేసును కూడా సిబిఐ దర్యాప్తు చేస్తోంది. ఇందులో ఎజిఎం స్థాయి అధికారి సహా మొత్తం ఆరుగురు సిబ్బంది పాత్ర ఉందని, వారు నిందితుడితో కలిసి పథకం వేశారని సిబిఐ గుర్తించింది. తాజా కేసులోనూ బ్యాంకు సిబ్బంది పాత్ర ఉండే అవకాశం ఉందని సిబిఐ అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ కేసులో మొత్తం 8మందిని నిందితులుగా గుర్తించినట్లు సమాచారం. కాగా నిందితుల్లో ఒకరైన చాణక్య రిటైర్డ్ ఏఐఎస్ కుమారుడని తెలుస్తోంది.
కాగా వీరిలో ఇద్దరు గతంలో హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లో పలు బ్యాంకులను, వ్యక్తులను, సంస్థలను మోసగించినట్లు వెల్లడైంది. గతంలో సిసిఎస్ పోలీసులు వీరిని అరెస్టు చేశారు. ఒక్క హైదరాబాదులోనే వీరిపై 15 వారెంట్లు పెండింగులో ఉన్నాయి. ఖరీదైన ఆడి, బెంజ్, వంటి కార్లను రుణంపై తీసుకొని వాటిని నకిలీ పత్రాలతో విక్రయించేవారు.