మీరు తెస్తే బాధ్యత మాదే: తెలంగాణపై కాంగ్రెస్కు కిషన్
తెలంగాణపై ఇచ్చిన మాట తప్పినందుకు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణపై బిజెపి కట్టుబడి ఉందని, కాంగ్రెసు మాత్రం మాట తప్పిందన్నారు. తెలంగాణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెడితే తమ పార్టీ భేషరతుగా మద్దతిస్తుందని కాంగ్రెసుకు సూచించారు. టిడిపి, సిపిఎం, ఎంఐఎం మద్దతు ఇవ్వక పోయినప్పటికీ బిల్లును పాస్ చేయించే బాధ్యత తమదే అన్నారు.
తెలంగాణ బిల్లు పార్లమెంటులో పెట్టి ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చాలని కాంగ్రెసుకు విజ్ఞప్తి చేశారు.తెలంగాణ రాష్ట్రం ఎవరికీ వ్యతిరేకం కాదని, తెలంగాణను ఏ ప్రాంత ప్రజలు కూడా వ్యతిరేకించడం లేదన్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల నేతలకు, జిల్లాలకు తెలంగాణ వ్యతిరేకం కాదన్నారు. నాడు ఏ హైదరాబాదు రాజధానిగా ఉండేదో అదే నగరం రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్నారు. హిందీ మాట్లాడే వారికి ఇన్ని రాష్ట్రాలు ఉండగా తెలుగు మాట్లాడే వారికి రెండు రాష్ట్రాలు ఉంటే తప్పేమిటని ప్రశ్నించారు.
అన్నదమ్ముల్లా విడిపోయి రెండు ప్రాంతాలను సమాంతరంగా, వేగంగా అభివృద్ధి చేసుకుందామన్నారు. బిల్లు పెట్టి తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని కాపాడాలన్నారు. ప్రజలే దేవుళ్లు అని, వారే అంతిమ నిర్ణేతలు అన్నారు. అప్పట్లో పార్లమెంటు ముందు ధర్నా చేసిన నేతల పైన కాంగ్రెసు ఎదురు దాడి చేసిందన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రజాభిప్రాయాన్ని గౌరవించాలని కాంగ్రెసుకు హితవు పలికారు. బిజెపిది ఒకటే మాట అని.. ఇతర పార్టీల్లా రెండు కళ్ల సిద్ధాంతాలు, రెండు మాటలు లేవన్నారు.