మరో టెర్రరిస్ట్ అరెస్టు: కిషన్ రెడ్డి టార్గెట్లో లేరన్న సిపి
మూడు నెలలుగా సిద్దిక్ పంపించిన ఈ మెయిల్స్, కాల్ వివరాలను పోలీసులు పరిశీలించారు. ఇతనికి సౌదీ అరేబియా ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లుగా గుర్తించాలని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో ఒక టీంను ఏర్పాటు చేసుకొని నెట్ వర్క్గా పని చేసేందుకు సిద్దిక్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా గుర్తించారు. మెడికల్ విద్యను అభ్యసిస్తున్న సిద్దిక్ తీవ్రవాద భావజాలం వైపుకు మరలడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కాగా సిద్దిక్ నుండి పోలీసులు పదివేల రూపాయలు, లాప్ టాప్, సెల్ ఫోన్, ఉగ్రవాద సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఉగ్రవాదుల అరెస్టు తర్వాత వారి టార్గెట్లో ఉన్న వారికి భద్రత పెంచామని నగర పోలీసు కమిషనర్ అనురాగ్ శర్మ అన్నారు. హుజీ టార్గెట్లో ఉన్న వారి భద్రతపై తాము సమాలోచనలు జరుపుతున్నామని, వారికి భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, అంబరుపేట శాసనసభ్యుడు కిషన్ రెడ్డి హుజి టార్గెట్లో లేరని చెప్పారు. హైదరాబాదులో ఇద్దరు కార్పోరేటర్లు హుజీ టార్గెట్లో ఉన్నారని, వారికి భద్రత పెంచామని చెప్పారు.
బయోడైవర్సిటీ కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేశామని, గణేష్ నిమజ్జనం కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. కేసు పురోగతిపై బెంగళూరుకు పోలీసులను పంపించామని చెప్పారు.