ఆ తర్వాత తెలంగాణే: అద్వానీ, బిజెపి వస్తుందని.. కిషన్

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తొలి నినాదం అవినీతి, రెండో నినాదం తెలంగాణ అని అద్వానీ పేర్కొన్నారు. ప్రజాకాంక్ష త్వరలోనే సఫలమవుతుందని, దాన్ని ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు. మిగతా ప్రాంతాల నుంచి వ్యతిరేకత లేకుండా చూసుకోవాలని సూచించారు. ఆ ప్రాతిపదికన ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని ప్రాంతాలు ప్రత్యేక రాష్ట్రాలు గా ఏర్పడినా మంచిదేనన్నారు. విడిపోయిన తరువాత కూడా అన్నీ స్నేహభావంతో ఉండాలని ఆకాంక్షించారు. విభజన ఉద్యమాలపై తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
మొదటి సార్వత్రిక ఎన్నికల (1952)నుంచి 2009వరకూ పార్టీ ప్రచారకుడిగా, అభ్యర్థిగా అన్ని ఎన్నికలనూ చూశానని, భారతీయ జనసంఘ్ నాయకుడిగా ఉత్తరప్రదేశ్లో పర్యటించినప్పుడు ఉత్తరాఖండ్ను వేరు చేయాలని, బీహార్కు వెళ్లగా ఉత్తర బీహార్ను వేరుచేసి జార్ఖండ్ ఏర్పాటు చేయాలని, మధ్యప్రదేశ్ వెళితే రాజధాని దూరంగా ఉందనే కారణంగా ఛత్తీస్గఢ్ను ప్రత్యేక రాష్ట్రం చేయాలంటూ ప్రజలు విజ్ఞప్తి చేసేవారని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కొత్త రాష్ట్రాలేవీ ఏర్పడబోవని, జనసంఘ్ను ఎన్నుకుంటే కచ్చితంగా ప్రత్యేక రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చామన్నారు.
1999లో ఆ మాట నిలబెట్టుకున్నామని, మూడు రాష్ట్రాల ఏర్పాటుకు ఆయా ప్రాంతాల ప్రజల విజ్ఞప్తులను అప్పట్లో ప్రధాని వాజ్పేయి దృష్టికి తీసుకు వెళ్లానన్నారు. హోం మంత్రిగా ఆ బాధ్యత నాదే కాబట్టి ఆయన అంగీకరించారు. పెద్దగా వ్యతిరేకత లేకుండానే పార్లమెంటులో బిల్లులకు ఆమోదముద్ర వేయించుకొని మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేశామన్నారు. 1999 ఎన్నికల్లో తెలంగాణ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టకపోవడానికి కూటమిలోని పార్టీలే కారణమన్నారు.
కూటమి పార్టీల నుంచి వ్యతిరేకత లేకుంటే మూడు రాష్ట్రాలు ఇచ్చినప్పుడే తెలంగాణనూ ఏర్పాటుచేసేవారమని, ఈ విషయమై తాను ఇప్పటికీ విచారిస్తున్నానని చెప్పుకొచ్చారు. మాకు మద్దతిస్తున్న కొన్ని సహచర పార్టీలు తెలంగాణ డిమాండ్ను వ్యతిరేకించాయని, ఈ కారణంగానే పార్టీ మేనిఫెస్టోలో ఆ అంశం చేర్చలేకపోయామని, లేదంటే తెలంగాణ కోసం ఆ ప్రాంత ప్రజలు ఇంత శ్రమ పడాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. అప్పట్లో వ్యతిరేకించిన పార్టీలు ఇప్పుడు సానుకూలంగా మారాయని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి అన్నారు.
కానీ, తెలంగాన అంశాన్ని 2004 ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెట్టిన కాంగ్రెస్, ఇప్పటికీ ఏర్పాటు చేయలేకపోయిందని విమర్శించారు. నల్లధనం, అవినీతి, ధరల పెరుగుదలపై తాను దేశవ్యాప్తంగా జరిపిన జన చైతన్య యాత్రలకు సంబంధించి తెలంగాణలోనే ఎక్కువ మద్దతు లభించిందని చెప్పారు. డిసెంబర్ తొమ్మిది ప్రకటనను వెనక్కి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకతనంతా వారలా చాటుకున్నారని వివరించారు.
తెలంగాణలో బలపడేందుకే దీక్ష చేస్తున్నామన్న వాదనలో నిజం లేదని కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం ఇస్తే బిజెపి అధికారంలోకి వస్తుందంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ వద్ద ఎంఐఎం లాబీయింగ్ చేస్తోందని ఆరోపించారు. 1969లో 369 మందిని, ఇప్పుడు 850 మం దిని పొట్టనబెట్టుకున్న కాంగ్రెస్.. ప్రతి చావుకు జవాబు చెప్పాల్సి ఉందని హెచ్చరించారు. తెలంగాణపై ఏవేవో ప్రతిపాదనలున్నా వేటినీ ప్రజలు అంగీకరించరన్నారు. 1956కు ముందున్నతెలంగాణే కావాలన్నారు. తెలంగాణ సిగ్నల్స్కు అడ్డుపడుతోం ది కాంగ్రెస్ పార్టీ జామర్లేనని, వాటిని బద్దలు కొట్టి కాంగ్రెస్ను పాతరేస్తేనే తెలంగాణ వస్తుందన్నారు.












Click it and Unblock the Notifications