శివకాశి దుర్ఘటన: ఆరుగురి అరెస్టు, మృతులు 39యే
గురువారం అరెస్టయిన ఆరుగురు - తిరుత్తనగళ్లోని పెరియార్ కాలనీకి చెందిన ఆర్ పాల్ పండి (30), అతని సోదరుడు ఆర్ మహేంద్రన్ (28), ఆర్ పండితురై (24), ఫ్యాక్టరీలోని ఫోర్మాన్ యు ఉదయ్ కుమార్ (31), పెరియార్ కాలనీలోనే నివసిస్తున్న మరో ఇద్దరు ఎస్ శ్రీకాంత్, ఎస్ అన్నాదురై. పరారీలో ఉన్న మురగేషన్ నుంచి పాల్ పాండి ఫైర్ క్రాకర్స్ యూనిట్ను లీజుకు తీసుకున్నాడు. అతన్ని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసు అధికారులు చెప్పారు.
పాల్ పాండిని, అతని సోదరుడు మహేంద్రన్ను సంఘటనా స్థలంలోనే అదుపులోకి తీసుకున్నట్లు, వారిచ్చిన సమాచారం మేరకు మరో నలుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు సంభవించిన వెంటనే ఇతర కార్మికులు పారిపోయారు.
సకాలంలో ఆర్డర్స్ను పంపడానికి కార్మికులను ఎక్కువగా తీసుకున్నట్లు పాల్ పాండి చెప్పాడు. తమిళనాడులో బుధవారం మధ్యాహ్నం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. శివకాశీలోని ఓం శివశక్తి ఫైర్ వర్స్క్లో భారీ పేలుడు సంభవించింది. శివకాశీ బాణాసంచా తయారీకి పెట్టింది పేరు. ప్రమాదం జరిగిన ఈ ఫ్యాక్టరీ శివకాశీకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సదానందపురం వద్ద ఉంది. దీపావళి పండుగ వస్తున్న సందర్భంగా బాణాసంచా తయారీని ఎక్కువ మందితో, ఎక్కువ మోతాదులో చేపట్టడమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది.