కాంగ్రెసులో జగన్ పార్టీ విలీనం కలకలం: ఖండన

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిపోతుందని, ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని కథనాలు వస్తున్నాయి, దీనికి మీరేమంటారని ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నలకు భవిష్యత్తు మాత్రమే దాన్ని నిర్ణయిస్తుందని ఆమె జవాబిచ్చారు. పీటీఐ విలేకరి అడిగిన ప్రశ్నకు వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి నర్మగర్భంగా ఇచ్చిన జవాబుగా దాన్ని స్వీకరించారు.
విలీనం లేదా పొత్తు ఉండదని ఆమె తేల్చి చెప్పలేదు అదే సమయంలో, మతతత్వ పార్టీ (బీజేపీ)తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని గతంలో జగన్ తేల్చిచెప్పారని గుర్తుచేశారు. ఫీజు దీక్ష సందర్భంగా శుక్రవారం ఆమె పీటీఐకి ఇంటర్వ్యూ ఇచ్చారు. కాంగ్రెస్కు సంబంధించి తమ ద్వారాలు తెరుచుకునే ఉన్నాయని సంకేతాలిచ్చారు. కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెసు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నాయని, కేసుల నుంచి జగన్ బయటకు రాగానే ఆ రెండు పార్టీలూ విలీనమవుతాయని టీడీపీ విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.
విజయలక్ష్మి నర్మగర్భంగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం పార్టీ విమర్శలకు బలం చేకూరుస్తున్నాయని పీటీఐ వ్యాఖ్యానించింది. కిరణ్ ప్రభుత్వానికి విజన్ కానీ, వైఎస్కు ఉన్నట్లు ఉదారత కానీ లేవని విజయలక్ష్మి విమర్శించారు. ప్రజాసమస్యలపై తాము పోరాడుతూనే ఉంటామన్నారు. "ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నాం. మేమేం చేయలేం. జగన్ సీఎం అయితే.. అన్ని సమస్యలనూ పరిష్కరిస్తాడని, ప్రజలను సంపన్నులను చేస్తాడన్న విశ్వాసాన్ని కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం'' అని చెప్పారు.
కాంగ్రెస్తో విలీనం లేదా పొత్తుపై విజయలక్ష్మి వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. దీంతో, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వెంటనే స్పందించింది. విజయలక్ష్మి పేరిట ఓ ప్రకటనను విడుదల చేసింది. "కాంగ్రెస్తో విలీనాన్ని వైసీపీ ఖండిస్తోంది'' అని ప్రకటించింది. పీటీఐ వార్తా కథనాన్ని అత్యంత హేయమైన చర్యని అభివర్ణించింది. కుట్రపూరితంగా కథనం ఎందుకు ఇచ్చిందో పీటీఐ సమీక్షించుకోవాలని కోరింది.












Click it and Unblock the Notifications