నిరుద్యోగ భృతి ప్రారంభించిన అఖిలేష్: ఇక్కడా తెరపైకి
ఈ పథకం కింద పదో తరగతి ఉత్తీర్ణులై 25-40 సంవత్సరాల మధ్య ఉండి, కుటుంబ ఆదాయం రూ.36 వేల కంటే తక్కువ ఉన్న యువతకు ప్రభుత్వం ప్రతి నెల రూ.వెయ్యి ఇస్తుంది. లక్నో, ఉన్నావ్, హర్దోజీ, సితాపూర్, లఖింపూర్, రాయ్బరేలీ, కాన్పూర్ జిల్లాల నుండి దరఖాస్తు పెట్టుకున్న 10,500 మంది విద్యార్థులకు తొలుత చెక్కులు అందజేస్తారు. ఆ తర్వాత నిరుద్యోగ భృతిని వారి వారి అకౌంట్లలో మూడు నెలలకు ఓసారి జమ చేస్తామని ట్రెయినింగ్ అండ్ ఎంప్లాయిమెంట్ డైరెక్టర్ అనిల్ కుమార్ చెప్పారు.
నిరుద్యోగ భృతి కోసం యువత పెద్ద ఎత్తున ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకుందని చెప్పారు. అలా దరఖాస్తు చేసుకున్న వారి సంఖ్య దాదాపు ఐదు లక్షలు ఉంటుందని చెప్పారు. వాటిని పరిశీలించి భృతి కల్పిస్తామని చెప్పారు. కాగా గత సాధారణ ఎన్నికల సమయంలో సమాజ్వాది పార్టీ నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశ పెడతామని హామీ ఇచ్చింది.
కాగా మన రాష్ట్రంలోని 2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నిరుద్యోగ భృతి పథకాన్ని తన మేనిఫెస్టోలో పెట్టిన విషయం తెలిసిందే. దీనిని చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కుమార్ రూపొందించినట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు చెప్పారు. అయితే నిరుద్యోగ భృతిని విపక్షాలు తప్పు పట్టడం, ఇవ్వడం కష్ట సాధ్యమని చెప్పటం చేశాయి. అయితే ఇటీవల చంద్రబాబు పలుమార్లు నిరుద్యోగ భృతి అంశాన్ని తెరపైకి మళ్లీ తీసుకు వచ్చారు. ఇప్పుడు యుపిలో అఖిలేష్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడంతో రాష్ట్రంలో, ప్రధానంగా టిడిపిలో ఈ అంశం చర్చకు వస్తోంది. అక్కడ సైకిల్ గుర్తు ఉన్న ఎస్పీ గెలిచినప్పుడే ఇక్కడి టిడిపి మార్పుపై హర్షం వ్యక్తం చేసింది.
అక్కడ సైకిల్ గెలిచిందని, రానున్న ఎన్నికలలో ఇక్కడ కూడా అదే జరుగుతుందని చెప్పారు. ఇప్పుడు తాము ప్రవేశ పెడతామనుకున్న నిరుద్యోగ భృతి పథకాన్ని అఖిలేష్ ప్రభుత్వం ప్రవేశ పెట్టడంతో టిడిపిలో కొత్త ఉత్సాహం కనిపించడం ఖాయమంటున్నారు. ఈ పథకం 2014లో ఖచ్చితంగా తమకు లబ్ది చేకూరుస్తుందని తెలుగు తమ్ముళ్లు భావిస్తున్నారు. ఇది బాబుకు ఖచ్చితంగా ఉత్సాహాన్ని ఇస్తుందని, సాధారణ ఎన్నికలకు మరెంతో సమయం లేనందున టిడిపి నేతలు కూడా అఖిలేష్ పథకాన్ని ఇక నుండి ప్రస్తావించే అవకాశాలు లేకపోలేదంటున్నారు. తప్పని పరిస్థితుల్లో మిగతా పార్టీలు కూడా టిడిపిని ఫాలో కావడం తప్పదంటున్నారు. అందుకు బిసి డిక్లరేషన్ను ఉదాహరణగా చెబుతున్నారు.