ఆజాద్ మాటలు: తెలంగాణ సంకేతాల చిక్కుల్లో కెసిఆర్
పార్లమెంటు సమావేశాల తర్వాత కొద్ది రోజులు ఢిల్లీలో ఉండాలని ఆజాద్ కెసిఆర్ను అడిగినట్లు కూడా వార్తలు వచ్చాయి. తెరాస వర్గాలు లీక్ చేసిన సమాచారం మేరకే ఆ వార్తలు వెలువడినట్లు ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ ఇవ్వాలా, వద్దా అనే విషయంపై తాము ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని ఆయన ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఆంగ్ల దినపత్రిక ఆజాద్ ఇంటర్వ్యూను ప్రచురించింది. ఆ ఇంటర్వ్యూ అంశాలు కెసిఆర్ను ఇరకాటంలో పెట్టే విధంగానే ఉన్నాయి.
సెప్టెంబర్ నెలాఖరులోగా తెలంగాణపై నిర్ణయం తీసుకుంటారా అని అడిగితే తమకు గడువు ఏమీ లేదని ఆయన చెప్పారు. తెలంగాణ సమస్య సంక్లిష్టమైందని, నిర్ణయం తీసుకోవడానికి సమయం పడుతుందని ఆయన అన్నారు. దీన్నిబట్టి ఇప్పట్లో తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు లేవని ఆజాద్ మాటలను బట్టి అర్థమవుతోంది. తెలంగాణపై నిర్ణయం తీసుకోవడం అంత సులభమై ఉంటే, ఇది వరకే ప్రకటన చేసి ఉండేవాళ్లమని ఆయన అన్నారు.
హైదరాబాద్ విషయంపై రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో ఏకాభిప్రాయం రావాల్సి ఉందని ఆయన అన్నారు. తెలంగాణపై మీడియా ప్రతినిధుల సమావేశంలోనూ ఆయన ఇప్పట్లో తేల్చే పరిస్థితి లేదనే భావననే వ్యక్తం చేశారు. ఇంకా సంప్రదింపులు జరగాల్సి ఉందని ఆయన అన్నారు. తనకు తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చాయని కెసిఆర్ చేసిన ప్రకటనపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆయనపై మరింతగా విమర్శలు పెరిగే అవకాశం ఉంది.
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కెసిఆర్ మాటల వల్ల ఉద్యమం నీరు గారుస్తుందని అన్నారు. ఉద్యమాన్నీ నీరు గార్చేందుకే కెసిఆర్ అటువంటి ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఇటీవల విమర్శించారు. ప్రధాని మన్మోహన్ సింగ్ను కలిసిన తమకు తెలంగాణపై కేంద్రం అనుకూల ప్రకటన చేస్తుందనే సంకేతాలు అందలేదని, తెలంగాణపై తేల్చుస్తుందనే సంకేతాలు కూడా అందలేదని ఆయన అన్నారు. తాజాగా తెరాస శాసనసభ్యుడు హరీష్ రావు చేసిన ప్రకటన కెసిఆర్ సంకేతాల మాటల బుకాయింపును తెలియజేస్తోందని అన్నారు. తెలంగాణ రావడం ఖాయమని, ఇప్పుడా 2014లోనా అనేది చెప్పలేమని ఆయన అన్నారు. సంకేతాల మాటలతో కెసిఆర్పై విశ్వసనీయత ప్రమాదంలో పడే అవకాశం ఉంది.