చిరంజీవి దూకుడు: సమన్వయ కమిటీ భేటీ రద్దు
పార్టీ సమన్వయ కమిటీ భేటీ సోమవారం జరగాల్సి ఉండింది. ఈ కమిటీలో చిరంజీవి, బొత్స సత్యనారాయణలతో పాటు ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, సీనియర్ నాయకుడు షబ్బీర్ అలీ, పిసిసి మాజీ అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సభ్యులుగా ఉన్నారు. చిరంజీవి ఇటీవల సీనియర్ నాయకుడు వి. హనుమంతరావు నిర్వహించిన మేధోమథన సదస్సులో రాష్ట్ర కాంగ్రెసు పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పరిస్థితి చూస్తుంటే తాను అభద్రతా భావంతో కొట్టుమిట్టాడుతున్నానని ఆయన అన్నారు.
దాంతో చిరంజీవి సమన్వయ కమిటీ సమావేశంలో తన వాదనలను బలంగా వినిపించడానికి సమాయత్తమైనట్లు ముఖ్యమంత్రి వర్గానికి సమాచారం అందింది. షబ్బీర్ అలీ కూతురు వివాహానికి హాజరు కావడానికి ఆజాద్ హైదరాబాద్ వచ్చారు. నాయకత్వ విషయంపై సమన్వయ కమిటీ సమావేశంలో తీవ్ర దుమారం చెలరేగే అవకాశాలున్నట్లు ఆజాద్కు ముఖ్యమంత్రి వర్గీయులు చెప్పారు. దాంతో ఆజాద్ సమావేశాన్ని రద్దు చేసేలా ముఖ్యమంత్రి వర్గీయులు ప్రయత్నించారని అంటున్నారు.
పార్టీలో, ప్రభుత్వంలో సమన్వయం కొరవడిందని భావిస్తున్న చిరంజీవి, బొత్స సత్యనారాయణ కమిటీ సమావేశం జరగాలని కోరుకున్నారు. కానీ ముఖ్యమంత్రి వర్గం ప్రమాదాన్ని గ్రహించి ఆజాద్పై ఒత్తిడి తెచ్చినట్లు భావిస్తున్నారు. ఉప ఎన్నికలకు ముందు జూన్లో జరిగిన సమన్వయ కమిటీ భేటీ అర్థాంతరంగా ముగిసింది. సోమవారం సాయంత్రం ఆజాద్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, బొత్స సత్యనారాయణలతో విడివిడిగా సమావేశమయ్యే అవకాశం ఉంది.