జగన్కు శిక్ష తప్పదు: కౌంటర్లో సిబిఐ ఏం చెప్పింది?

జగన్ అక్రమాస్తుల కేసులో తాము తిరుగులేని సాక్ష్యాలు సంపాదించామని, అవి ఖచ్చితంగా శిక్షకు వీలు కల్పిస్తాయన్నారు. జగన్, ఆయన కుటుంబ సభ్యులు విదేశాల నుంచి వారి కంపెనీల్లోకి పెద్ద ఎత్తున హవాలా మార్గంలో నిధులు మళ్లించారని పేర్కొంది. ముఖ్యమైన కోణాల్లో దర్యాఫ్తు జరుగుతున్నందున ముద్దాయికి బెయిల్ కోరే హక్కు లేదని పేర్కొంది. ఇప్పటికే కేసుల విచారణకు జగన్ సహకరించడం లేదని, బెయిల్ ఇస్తే కేసులు బలహీనపడతాయని తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి ఆరు దేశాలు.. బ్రిటిష్ వర్జీనియా ఐలాండ్స్, హాంకాంగ్, లగ్జెంబర్గ్, మారిషస్, బ్రిటన్, సింగపూర్లకు లెటర్ ఆఫ్ రెగోరేటరీస్ పంపి నిరంతర సంప్రదింపులు జరుపుతున్నామని, అక్కడి నుంచి సమాచారం రావడానికి కొంచెం సమయం పడుతుందని తెలిపారు. కోల్కతా, ముంబయిలకు చెందిన నసూటుకేసు కంపెనీల ద్వారా పెద్ద మొత్తంలో నగదును తన గ్రూపు కంపెనీల్లోకి తెచ్చుకున్నారని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా విచారిస్తోందని పేర్కొంది.
ముంబయి, కోల్కతా, ఢిల్లీలతో పాటు విదేశాలకు నిందితుల నేరాలు విస్తరించాయని, నిమ్మగడ్డ ప్రసాద్ వెల్లడించిన వాస్తవాల ఆధారంగా విచారణ జరిపేందుకు జగన్కు నోటీసు ఇచ్చామని, వాటిని ఆయన హైకోర్టులో ఛాలెంజ్ చేశారని, హైకోర్టు మా విచారణను అడ్డుకోలేదని, ఆయా ప్రాంతాల్లోని కంపెనీల తీగ లాగుతున్నామని, విచారణ సందర్భంగా జగన్ను అరెస్టు చేయలేదని, జ్యూడిషియల్ రిమాండ్ తర్వాతే అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
సాక్షులను ప్రభావితం చేస్తారని, ఇప్పటికే సూర్యనారాయణ రెడ్డి అనే వ్యక్తిని ప్రభావితం చేసినట్లుగా విచారణలో తేలిందని, పిటిషనర్ రాజకీయంగా చాలా ప్రభావశీలి అని, రాజకీయంగా, వ్యాపారంగా విస్తృతమైన నెట్ వర్క్ ఉందని, బహిరంగంగా, అంతర్గతంగా సాక్షుల విషయంలో జోక్యం చేసుకునే అవకాశముందని, అది న్యాయప్రక్రియను, తదుపరి దర్యాఫ్తును, ఈ కేసులోని ఇతర కోణాలను నిస్పృహకు గురి చేయవచ్చునని పేర్కొంది.
నాన్ బెయిలబుల్ క్రిమినల్ కేసులోనిందితుడైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నప్పుడు కోర్టు బెయిల్ ఇస్తే తప్ప దర్యాఫ్తు పూర్తయ్యేంత వరకు అతడిని అదుపులోనే ఉంచుకోవచ్చునని, చట్టం అనుమతించని ఈ పద్దతిని వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ ప్రశ్నించే వీలు లేదని, జగన్ ఇతర నిందితులు కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం చేసి ఆమేరకు వారు సొమ్ము చేసుకున్నారని పేర్కొన్నారు. వ్యవస్థను తుంగలో తొక్కి.. తన తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని జగన్ కేవలం అయిదేళ్లలో కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారన్నారు.
ఇప్పటికే కోర్టుల్లో ఎన్నో తప్పుడు పిటిషన్లు దాఖలు చేసి దర్యాఫ్తు, కోర్టు ప్రక్రియను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారని, రాష్ట్ర మంత్రులు, ఐఏఎస్లకు ప్రభుత్వం న్యాయసాయం చేయడం ద్వారా వారంతా చేసింది కరెక్టేనని చెప్పినందు వల్ల తాను తప్పు చేయనట్లేనంటూ ముద్దాయి చేస్తున్న వాదనల్లో పస లేదని, న్యాయ సహాయానికి, దర్యాఫ్తుకు సంబంధం లేదన్నారు. అందరి పాత్రల పైనా దర్యాఫ్తు స్వతంత్రంగా జరుగుతోందన్నారు.












Click it and Unblock the Notifications