వెనక్కి తగ్గను, తప్పు పట్టను: రాజీనామాపై ధర్మాన
అభియోగాలు వచ్చినంత మాత్రాన నేరం రుజువు అయినట్టు కాదని, సిబిఐ ఛార్జిషీటు దాఖలు చేస్తే అరెస్టు చేయాలనేం లేదనే విధివిధానాలు విపక్షాలకు తెలిసినప్పటికీ, తనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేయడం ఎంతవరకూ సమంజషమో వారి విచక్షణకే వదిలేశానన్నారు. కార్యకర్తలతో చర్చించి కార్యాచరణ రూపొందించుకునేందుకే విపక్షాలు తనను అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నప్పటికీ సహనంతో వౌనం వహిస్తున్నానన్నారు.
వాన్పిక్ భూముల కేటాయింపుల అంశంలో తన పాత్ర ఏమీ లేదని ఆయన చెప్పారు. ముఖ్యమంత్రికి, రెవెన్యూమంత్రికి భూములు కేటాయించే అధికారం ఉండదని, క్యాబినెట్కు మాత్రమే ఉంటుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి కేబినేట్లో సభ్యుడిగా ఉండడం తప్ప భూముల కేటాయింపులో తనకు ఎటువంటి అధికారం లేదని స్పష్టం చేసారు. వైయస్సార్ కేబినేట్కు ముందు కూడా చంద్రబాబునాయుడు మంత్రి వర్గంలో కూడా వేల ఎకరాల భూములు కేటాయింపులు పారిశ్రామికాభివృద్ధికి కేటాయించినట్లే వైఎస్సార్ కేబినేట్లో కూడా భూముల కేటాయింపులు జరిగిందన్నారు.
రెవెన్యూ మంత్రికో, ముఖ్యమంత్రికో భూముల కేటాయింపు అధికారాలు లేవన్నారు. దేశంలో అత్యున్నతమైన దర్యాప్తు సంస్థ సిబిఐను తప్పుపట్టడం లేదన్నారు. వారు సేకరించిన పత్రాల ఆధారంగానే ఛార్జిషీటులో తనను కూడా చేర్చారన్నారు. అయితే సిబిఐ చేసే ఆరోపణలు, అభియోగాల్లో తన పాత్ర ఎంతనే విషయాన్ని న్యాయకోవిదులే తేల్చుతారన్నారు. ఈ కేసులో తాను ఏ తప్పు చేయలేదన్నారు.
కాగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, ఢిల్లీ పెద్దలు వాయిలార్ రవి, ఆజాద్, పిసిసి చీఫ్ బొత్స, కేబినేట్ మంత్రులు, శ్రీకాకుళం జిల్లా ఎమ్మెల్యేలంతా తన పట్ల చూపిన విశ్వాసం, ప్రేమతో తన బాధ్యత మరింత పెరిగిందన్నారు. భూముల కేటాయింపుల్లో తెలిసి ఏ తప్పూ చేయలేదని, అలాగే తెలియని తప్పులు కూడా తాను చేయలేదంటూ వేలాది మంది కార్యకర్తల ముందు ధర్మాన ప్రకటించారు. మంత్రి కోండ్రు మురళీమోహన్, పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ కిల్లి కృపారాణి తదితరులు పాల్గొన్నారు.