బాబు ఫ్యామిలీ ఆస్తుల విలువ రూ. 35.59 కోట్లు
కాగా, నారా లోకేష్ ఆస్తుల విలువ రూ. 6.62 కోట్ల రూపాయలు ఉంది. చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఆస్తుల విలువ రూ. 2.09 కోట్లు ఉంది. తాను నిరుడు తన ఆస్తుల వివరాలను వెల్లడించిన తర్వాతనే కేంద్ర ప్రభుత్వంలో చలనం వచ్చిందని చంద్రబాబు అన్నారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలని, తాను కాపాడుకుంటున్నానని ఆయన చెప్పారు. తన పిల్లలు మంచి చదువులు చదువుకుని వ్యాపారాలు చేసుకుంటున్నారని, అయినా తాను రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి వారి ఆస్తుల వివరాలు కూడా వెల్లడిస్తున్నానని ఆయన అన్నారు.
కొంత మంది రాజకీయాలను స్వార్థం కోసం వాడుకుని కోట్లు సంపాదిస్తున్నారని ఆయన విమర్శించారు. పిల్లలకు డబ్బులు ఇవ్వడం కన్నా వారికి మంచి చదువులు చెప్పించాలని ఆయన అన్నారు. హెరిటేజ్ సంస్థల ద్వారా తన కుటుంబ సభ్యులు చాలా మందికి ఉపాధి కల్పిస్తున్నారని ఆయన చెప్పారు. వ్యాపారాలు నీతినిజాయితీలతో చేయవచ్చు, దోచుకోవడానికి చేయవచ్చునని, తన కుటుంబ సభ్యులు నీతినిజాయితీలతో వ్యాపారాలు చేస్తున్నారని ఆయన చెప్పారు. రెండు ఎకరాలు, రెండు వేల కోట్లు అంటూ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు.
తన పార్టీకి ఖర్చుల కోసం కూడా నిధులు లేవని ఆయన చెప్పారు. రాజకీయ పార్టీలు విరాళాలు తీసుకోవడం తప్పు కాదని ఆయన అన్నారు. అవినీతి కార్యకలపాలు 70 శాతం మన రాష్ట్రంలోనే సాగుతున్నాయని, మన రాష్ట్రంలోని అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తే దేశంలోని అవినీతిపై పోరాటం చేసినట్లేనని ఆయన అన్నారు. తన కుమారుడు నారా లోకేష్ కార్యకర్తగా పార్టీ కోసం పనిచేస్తానని చెప్పడాన్ని ఆయన ఆహ్వానించారు. కార్యకర్తగా ఎవరైనా పనిచేయవచ్చునని ఆయన అన్నారు.