మంత్రివర్గం నుండి వైదొలిగే యోచనలో తృణమూల్
ఎఫ్డీఐలు వంటి కీలక అంశంపై కాంగ్రెస్ పార్టీ ఏనాడూ తమ పార్టీని సంప్రదించలేదని తేల్చిచెప్పారు. సామాన్యుడి సమస్యలపై జరిపే పోరాటానికి మేము అంకితమని, ప్రాణం ఇస్తామే గానీ ప్రయోజనాల్లో రాజీ పడేది లేదన్నారు. అదే సమయంలో తమ పార్టీగానీ, ప్రభుత్వం గానీ ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకం కాదని వెల్లడించారు. సంస్కరణలు అవసరమేనని, దానర్థం సమస్తాన్ని అమ్మివేయడం కాదని, కొంతమంది వ్యక్తుల ప్రయోజనాలను సంతృప్తి పరచడం కానే కాదని ఆమె తన ఫేస్బుక్లోనూ, డీజిల్, ఎఫ్డీఐలకు వ్యతిరేకంగా పార్టీ నేతృత్వంలో కోల్కతాలో జరిగిన భారీ నిరసన ప్రదర్శనలు, సభల్లోనూ కుండబద్దలుకొట్టారు.
రాష్ట్రంలో ప్రతిపక్షం స్థానాల్లో కూర్చున్న నాడు కూడా మమత పార్టీ చిల్లర వర్తకం తదితర రంగాల్లో ఎఫ్డీఐలను వ్యతిరేకిస్తోంది. ఆ పార్టీ ఎన్నికల ప్రణాళికలోని కీలక అంశాల్లో అదీ ఒకటి. కేంద్రానికి లోపల నుంచి మద్దతు ఇస్తున్నా.. ఎఫ్డీఐల విషయంలో మాత్రం స్థిరమైన వ్యతిరేకతను పార్లమెంటులోనూ చూపుతూ వచ్చింది. స్టాక్ మార్కెట్ సూచీని పెంచడానికి తప్ప మరెందుకూ కొరగావని మమత తేల్చి చెప్పారు. ప్రజాస్వామిక వ్యవస్థలో సంస్కరణలు అనేవి పేదసాదలకు, సామాన్యులకు ఉపయోగపడాలని, వారి పట్ల అవి బాధ్యతతో వ్యవహరించడంలోనే ప్రజాస్వామ్యం గొప్పదనం దాగి ఉన్నదని అభిప్రాయపడ్డారు.
తమ ప్రజల సామాజిక భద్రత కోసం అభివృద్ధి చెందిన దేశాలు అమలు చేస్తున్న ప్రత్యేక పథకాలను ఆమె గుర్తు చేశారు. అందుకు భిన్నంగా మనదేశంలో సామాన్యుడికి సుస్థిర రక్షణ యంత్రాంగం గానీ, దీర్ఘకాలిక ప్రయోజనాలు అం దించే సంక్షేమ వ్యవస్థ గానీ లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశాభివృద్ధికి ఇప్పుడున్న పరిస్థితుల్లో విదేశాల్లో దాచిన నల్లధనాన్ని తీసుకురావడమే మార్గమని అభిప్రాయపడ్డారు. కేంద్రానికి విధించిన గడువులో మార్పేమీ లేదని, డెడ్లైన్ ముగిసిన మరుక్షణంలోనే కఠిన నిర్ణయం తీసుకోవడం తథ్యమని, దీనికోసమే మంగళవారం పార్టీ పార్లమెంటరీ బోర్డు ఢిల్లీలో భేటీ అవుతుందని, ఎఫ్డీఐలపై అప్పటికి కేంద్రం తగ్గకపోతే ఆ సమావేశంలోనే భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామన్నారు.