కౌంట్ డౌన్ ప్రారంభమైంది, ఎన్నికలు కోరుకోవట్లే: బాబు
యూపిఏలోని ప్రధాన పార్టీ అయిన కాంగ్రెసు ఏకపక్ష నిర్ణయాల వల్లనే మిత్ర పక్షాలు దూరమవుతున్నాయని ఆయన ఆరోపించారు. కాంగ్రెసు రోజు రోజుకు ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుందన్నారు. తద్వారా ఆ పార్టీ క్రమంగా బలహీన పడుతుందని, యూపిఏ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైందని అన్నారు.
కాంగ్రెసు బలహీనపడుతుండగా భారతీయ జనతా పార్టీ పరిస్థితి కూడా మెరుగ్గా లేదన్నారు. ఆ పార్టీ ఇప్పుడు పుంజుకునే పరిస్థితిల్లో లేదన్నారు. కాంగ్రెసు, బిజెపిలు ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన నేపథ్యంలో థర్డ్ ఫ్రంట్కు మెరుగైన అవకాశాలు ఏర్పడుతున్నాయని చెప్పారు. సరైన సమయంలో జాతీయస్థాయిలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటవుతుందన్నారు.
కాగా గురువారం వామపక్షాలు, తెలుగుదేశం, సమాజ్వాది తదితర పార్టీల ఆధ్వర్యంలో పెంచిన పెట్రో ధరలను నిరసిస్తూ ఢిల్లీలో ఆందోళన చేపడుతున్న విషయం తెలిసిందే. ఈ ఆందోళనలో పాల్గొనేందుకు చంద్రబాబు నాయుడు దేశ రాజధానికి వెళ్తున్నారు.
మరోవైపు రేపటి బంద్ నేపథ్యంలో టిడిపి, వామపక్షాలు ముగ్ధుం భవనంలో భేటీ అయ్యాయి. ఈ సందర్భంగా నారాయణ తెలంగాణ రాష్ట్ర సమితికి సూచన చేశారు. రేపటి బందులో ఆ పార్టీ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. బంద్ సందర్భంగా ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను రేపు జరపకుండా మరో రోజుకు వాయిదా వేయాలని సూచించారు.