బాబ్లీ బదులు బాబ్రీ అన్నఎపి లాయర్: కోర్టులో నవ్వులు
బాబ్లీపై గంభీరంగా వాదనలు సాగుతుండగా పరాశరణ్ పలుమార్లు పొరబాటు పడటంతో కోర్టులో నవ్వులు విరిశాయి. పరాశరణ్ బాబ్లీ ప్రాజెక్టుపై ఎపి తరఫున వాదనలు వినిపిస్తూ.. బాబ్లీ బదులు బాబ్రీ మసీద్. బాబ్రీ మసీద్ అని పలికారు. ఈ విషయాన్ని గ్రహించిన జస్డిస్ ఠాకూర్ మీరెందుకు పదే పదే బాబ్రీ మసీద్ అంటున్నారని నవ్వుతూ ప్రశ్నించారు.
జరిగిన పొరపాటును గుర్తించిన పరాశరణ్ వెంటనే తమాయించుకొని... తన మనువడితో బాబ్రీపై చర్చించడంతో అదే తన మనసులో పడిపోయిందని న్యాయమూర్తులకు వివరించారు. ఆ తర్వాత జస్టిస్ లోథా దానిని కొనసాగిస్తూ.. ఇది వరకు సీనియర్ న్యాయవాది పిపి రావు కూడా ఇలాగే పొరబడ్డారని చెప్పారు.
పిపి రావు మాధురీ పాటిల్కు బదులు బాలీవుడ్ సినీ నటి మాధురీ దీక్షిత్ పేరును పలికారని, అలాగే సుష్మా సూరీ కేసులో వాదిస్తూ.. ఆ పేరు పలకకుండా భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, లోకసభ ప్రతిపక్ష నేత సుష్మా స్వరాజ్ పేరు పలికారని గుర్తు చేశారు. దీంతో న్యాయస్థానం నవ్వులతో నిండిపోయింది.