తెలంగాణ: లేఖపై బాబు డైలామా, పాదయాత్రపై ప్రభావం
లేఖ ఇవ్వాలని తెలంగాణ ప్రాంత నేతలు కోరుతుండగా.. ఇస్తే రాజీనామా చేస్తామని, ఆ ప్రాంతంలో నష్టపోవాల్సి ఉంటుందని సీమాంధ్ర ప్రాంత నేతలు ఎడతెగని వాదనలు వినిపించి ఎవరికి వారుగా ఒత్తిడి తెస్తుండటం చంద్రబాబు ఎటూ పాలుపోని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంలో నెలకొన్న ప్రతిష్టంభన చంద్రబాబు పాదయాత్రపై కూడా ప్రభావం చూపుతోందట. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వాలన్న చంద్రబాబు యోచనకు సీమాంధ్ర ప్రాంత నేతల నుంచి భిన్న స్పందనలు వ్యక్తమయ్యాయి.
కేంద్రం ఈ అంశంపై మరోసారి అఖిలపక్ష సమావేశం పెట్టాలన్న యోచనలో ఉందని, అఖిలపక్షం పెట్టి చర్చించకుండా కేంద్రం ఏ నిర్ణయం తీసుకోలేదని, కేంద్రం అఖిలపక్షం పెట్టినా లేదా అన్ని పార్టీల అభిప్రాయాలు మరోసారి కోరినా అప్పుడు పార్టీపరంగా మన అభిప్రాయం చెబుతామని, ఇప్పుడు ఎవరూ అడగకుండా మనం లేఖ ఎందుకు ఇవ్వాలని, ఎవరికి ఇవ్వాలని వారు బాబు వద్ద తమ వాదన వినిపించారు.
లేఖ కాకుండా మరేం ప్రత్యమ్నాయాలు ఉన్నాయన్నదానిపై కూడా చంద్రబాబు వద్ద చర్చ జరిగింది. తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని బహిరంగంగా ప్రకటించాలని, గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని చెప్పాలని, కేంద్రం అడిగితే మరోసారి ఇస్తామని చెప్పాలని, మౌఖికంగా వంద చెప్పినా, లేఖగా మాత్రం కేంద్రం అడగకుండా ఇవ్వవద్దని సీనియర్లు బాబుకు సూచించారట. మరోపక్క తెలంగాణ నేతలు ఈ సమయంలో వెనక్కు తగ్గరాదని చంద్రబాబుపై ఒత్తిడి తెస్తున్నారు. అవసరమైతే మళ్లీ లేఖ ఇస్తామని బహిరంగంగా ప్రకటించామని, కాబట్టి దానిపై వెనక్కి తగ్గొద్దని తెలంగాణ నేతలు చెబుతున్నారు.
సీమాంధ్ర నేతలకు ఇబ్బంది ఉంటుందని, కానీ ఇంతదాకా వచ్చి వెనక్కు వెళ్లలేని పరిస్థితి అని తెలంగాణ ప్రాంతానికి చెందిన నేతలు చెబుతున్నారు. లేఖ విషయం తేలకపోవడంతో పాదయాత్ర ప్రారంభ స్ధలం కూడా ఇంతవరకూ తేలలేదు. లేఖ ఇస్తే ఈ యాత్ర తెలంగాణ నుంచి మొదలవుతుందని.. లేని పక్షంలో అనంతపురం జిల్లా హిందూపురం నుంచి మొదలవుతుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మహబూబ్నగర్ జిల్లా కొడంగల్ నుంచి యాత్రను మొదలు పెట్టాలన్న నిర్ణయంపై అభ్యంతరాలు రావడంతో ఆ స్థలం కూడా మారిపోయింది. ఇప్పుడు.. మహబూబ్నగర్ జిల్లాలోని కొసిగి, అనంతపురం జిల్లాలోని హిందూపురాలను తుది పరిశీలనకు ఉంచారు.