మార్చ్: తెలంగాణకు సమైక్యాంధ్ర కౌంటర్, త్యాగాలకు సై
తెలంగాణ మార్చ్ నిర్వహించే రోజునే తాము సమైక్యాంధ్ర మార్చ్ నిర్వహిస్తామని చెప్పారు. సీమాంధ్ర ప్రాంత నేతలు సమైక్యాంధ్ర కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ముందుకు రాని వారిని సమైక్యాంధ్ర వ్యతిరేకులుగా గుర్తిస్తామని, తమకు మద్దతు పలికే వారిని వచ్చే సాధారణ ఎన్నికలలో ఏకగ్రీవంగా ఎన్నుకుంటామని సూచించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎంపీలు రాజీనామా చేయాలని వారు పిలుపునిచ్చారు.
నేతలంతా ఉద్యమ బాట పట్టాలన్నారు. అవసరమైతే పదవులు వదులుకోవాలి కానీ విభజనకు మాత్రం అంగీకరించవద్దన్నారు. తాము గాంధేయ పద్ధతిలో తమ డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచుతున్నామని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాన్ని విడిపోనివ్వనివ్వమన్నారు. తెలంగాణవారు ఆర్థికంగా, రాజకీయంగా ఏవిధంగానూ వెనుకబడలేదన్నారు. ఏ ప్రాతిపదికన తెలంగాణ కోరుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నేతలు రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. రాష్ట్రం విడిపోతే సీమాంధ్ర రైతులు తీవ్రంగా నష్టపోతారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. డిసెంబర్ 9న కేంద్రం ప్రకటన చేయగానే నేతలంతా రాజీనామా చేశారని, గ్రామగ్రామానికి సీమాంధ్ర ఉద్యమం పాకిందన్నారు. తెలంగాణ నేతలు లక్ష మందితో మార్చ్ చేస్తే తాము పదిలక్షల మందితో చేస్తామన్నారు. ఒకవేళ రాష్ట్రాన్ని ఖచ్చితంగా విడగొట్టాల్సిన పరిస్థితి వస్తే ప్రాజెక్టులు పూర్తి చేసి, హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించిన తర్వాతనే విభజించాలన్నారు.