యూపిఏకు ములాయం ఆపన్న హస్తం: ఐనా ఉద్యమం
మమత బయటకు వెళ్లిపోవడంతో సింగ్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయి కష్టాల్లో పడింది. అయితే నిన్నటి వరకు బయటి నుండి యూపిఏకి మద్దతిస్తూ ఎటూ తేల్చని ములాయం ఈ రోజు కేంద్రానికి మద్దతు కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వానికి 19 మంది ఉన్న టిఎంసి మద్దతు ఉపసంహరించుకోగా 22 మంది ఉన్న ఎస్పీ తమ మద్దతు కొనసాగిస్తోంది. ఈ రోజు ములాయం సింగ్ ఢిల్లీలో మాట్లాడారు. యూపిఏకి తాము మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
మతతత్వశక్తులకు అవకాశం రాకుండా ఉండేందుకే తాము యూపిఏకి మద్దతు పలుకుతున్నామని, అయితే ఎఫ్డిఐలు, పెట్రో పెంపులపై కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. యూపిఏకి మద్దతు ఇస్తున్నప్పటికీ ప్రజా వ్యతిరేక కేంద్ర విధానాలపై తాము ఉద్యమిస్తామన్నారు. మతతత్వ శక్తులు లాభపడకుండా ఉండేందుకే తాము యూపిఏకి మద్దతిస్తున్నామని ఎస్పీ నేత గోపాల్ యాదవ్ చెప్పారు.
మరో నేత మోహన్ సింగ్ మాట్లాడుతూ... తాము రిటైల్ రంగంలో ఎఫ్డిఐలకు ఎప్పుడూ వ్యతిరేకమని, కేంద్రం దీనిని వెనక్కి తీసుకోవాలని కోరారు. మమతా బెనర్జీ వైఖరిని తాము సమర్థిస్తున్నామన్నారు. మరో నేత మాట్లాడుతూ తమ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్కు ప్రధాని అయ్యే అర్హత ఉందన్నారు.