ఎందుకు?: తెలంగాణ ఎంపీలు కామ్, మంత్రుల జోరు
మంత్రులు రాసిన లేఖపై తమ సంతకాలు తీసుకోకపోవడంపై ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రుల హోదా ఉన్న విప్ల సంతకాలు ఎందుకు తీసుకోలేదంటూ ఆయన అడిగారు. ఆ తర్వాత తెలంగాణకు చెందిన ప్రభుత్వ చీఫ్ విప్, విప్లు కలిసి సోనియాకు తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవాలంటూ లేఖ రాశారు. తెలంగాణ ఇస్తే హైదరాబాద్ సీటు మినహా తెలంగాణలోని పార్లమెంటు సీట్లన్నీ కాంగ్రెసుకే వస్తాయని చెప్పారు.
ఈ లేఖల వరుసలో తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులు లేఖ కూడా చేరింది. తెలంగాణ ఇవ్వాలంటూ తెలంగాణ శాసనసభ్యులు సోనియాకు లేఖ రాశారు. తాము వెనకబడిపోతామనే ఆదుర్దా కాంగ్రెసు మంత్రుల్లో, శానససభ్యుల్లో కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రెసు అధిష్టానం పెద్దలు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుతో చర్చలు జరపడం పట్ల జానారెడ్డి, ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కినుక వహించినట్లు చెబుతున్నారు. తమకు కాకుండా కెసిఆర్కు ప్రాధాన్యం ఇవ్వడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
తెలంగాణపై ఎప్పటికప్పుడు కెసిఆర్కు దీటుగా దూకుడు ప్రదర్శిస్తూ వచ్చిన తెలంగాణ పార్లమెంటు సభ్యులు మాత్రం చడీ చప్పుడు లేకుండా తమ పని తాము చేసుకుంటూ తమకేమీ సంబంధం లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే, ఈ నెల 25వ తేదీని ఓ ముఖ్యమైన తేదీగా చెబుతూ కాంగ్రెసు కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. ఈ నెలాఖరులోగా తెలంగాణపై నిర్ణయం వెలువడుతుందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూడా అన్నారు.
తెలంగాణ అంశంపై అధిష్టానంలో కదలిక తేవడంలో తమ వంతు కృషి చేశామని ప్రజల నుంచి అనిపించుకున్న తెలంగాణ పార్లమెంటు సభ్యులు ఇప్పుడు కెసిఆర్తో అధిష్టానం చర్చలు జరిపినా తమకు సమస్యగా భావించడం లేదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకుంటే ఆ క్రెడిట్ కెసిఆర్కే కాకుండా తమకు కూడా దక్కుతుందని వారు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు మాటలు మాత్రమే చెబుతూ వస్తున్న తెలంగాణ మంత్రులకు, శాసనసభ్యులకు మాత్రం ఉనికి సమస్యగా మారినట్లు చెబుతున్నారు. అందుకే ఇప్పుడు మంత్రులు, శాసనసభ్యులు దూకుడు ప్రదర్శిస్తున్నారని చెబుతున్నారు.