సత్సంగ్ ఆశ్రమంలో తొక్కిసలాట, తొమ్మిది మంది మృతి
డోయేగర్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ పర్వార్ తెలిపిన వివరాల ప్రకారం... గాయపడ్డ బాధితులకు సత్సంగ్ ఆసుపత్రిలో వైద్య చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. చికిత్స పొందుతున్న వారిలో 9 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. సత్సంగ్ ఆశ్రమంలోకి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారని, దీంతో కదిలేందుకు కూడా స్థలం లేకుండా పోయిందని, దీంతో ఈ తొక్కిసలాట జరిగిందని చెప్పారు. సత్సంగ్ వాలంటీర్లు లెక్కకు మించి భక్తులు రావడంతో మేనేజ్ చేయలేక పోయారని చెప్పారు.
తమ బాధ్యతలు నిర్వర్తించడంలో వాలంటీర్లు విఫలమయ్యారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పారు. ఈ ఘటన దురదృష్టకరమని సత్సంగ్ యాజమాన్యం ప్రకటించింది. మరోవైపు ఉత్తర ప్రదేశ్లోని మథుర జిల్లాలోని రాధా రాణి ఆలయంలో ఆదివారం తొక్కిసలాట జరిగింది.
ఈ తొక్కిసలాటలో ఇధ్దరు మహిళలు మృతి చెందగా, ఆరుగురు భక్తులు గాయపడ్డారు. ఆదివారం రాధాష్టమి సందర్భంగా బర్సాలోని రాధా రాణి ఆలయానికి భక్తులు పోటెత్తారు. త్వరగా దర్శనం చేసుకోవాలన్న ఆతృతతో భక్తులు ఒకరినొకరు తోసుకున్నారు. దీంతో తొక్కిసలాట జరిగిందని తెలుస్తోంది. అయితే జిల్లా అధికారులు మాత్రం దీనిని ఖండించారు. ఆలయం వద్ద వందకు పైగా మెట్లెక్కడంత ఊపిరాడక, గుండెపోటుతో ఇద్దరు మరణించారని తెలిపారు.