సీమాంధ్ర ఆస్తులపై దాడి, ఎంపీలను అరెస్ట్ చేస్తాం!: డిజి
గణేష్ నిమజ్జనం, జీవ వైవిధ్య సదస్సు నేపథ్యంలో అనుమతివ్వలేదన్నారు. ప్రజల ఆస్తులకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తామన్నారు. హైదరాబాద్ నగర శివార్లలో అన్ని ప్రాంతాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేస్తున్నామని, శాంతిభద్రతల సమస్యలు సృష్టిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరుకునే సమస్య లేదన్నారు. మిలియన్ మార్చ్ సమయంలో కేసులు ఉన్న వారు ఈ మార్చ్కు రావడం లేదని సమాచారముందన్నారు.
కవాతుకు వచ్చేవారంతా కొత్తవారే అన్నారు. సాధారణ ఆందోళనల్లోనూ ఉన్మాదం తలెత్తే అవకాశముందని, మిలియన్ మార్చ్ సంఘటన ఆధారంగానే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అంతర్జాతీయ సదస్సుకు ప్రధానమంత్రి సహా పలువురు ప్రముఖులు హాజరవుతారని, జెఏసి వద్ద కొత్త ఆయుధాలు ఉంటే వాటిని తిప్పి కొట్టేందుకు మా వద్ద సరికొత్త ఆయుధాలున్నాయన్నారు. ముందస్తు అరెస్టులు తప్పవని చెప్పారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంపీలు, ఎమ్మెల్యేలను అరెస్టు చేస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు కేంద్ర బలగాలు వస్తున్నాయని, కవాతులో ఎవరు పాల్గొంటామన్న ఆపడానికి వీలు లేదన్నారు. దాడులు జరిగితే రబ్బరు బుల్లెట్లు ఉపయోగించమన్నారు. సదస్సుకు భంగం కలగకుండా చూసే బాధ్యత తమపై ఉందన్నారు. సమస్య సృష్టించే వారిని కట్టడి చేస్తామన్నారు.