28న విస్తరణ: జైపాల్ రెడ్డికి రైల్వే, కేబినెట్లోకి చిరంజీవి?
కాగా తృణమూల్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ యూపిఏ ప్రభుత్వానికి రాం రాం చెప్పడంతో 28వ తేది లోపు కేంద్రమంత్రి వర్గంలో మార్పులు చేర్పులు జరుగుతాయనే ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. అయితే 28నే పునర్వవస్థీకరణ జరిగే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఢిల్లీ పెద్దలు ఆ తేదిలోగా మార్పులు చేర్పులు చేయాలని చూస్తున్నారని సమాచారం. ఈ పునర్వవస్థీకరణలో మన రాష్ట్రానికి చెందిన ముగ్గురు లేదా నలుగురు పార్లమెంటు సభ్యులను మన్మోహన్ కేబినెట్లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీలో గుసగుసలు వినిపించాయి.
ఎన్నాళ్లుగానో కేంద్రమంత్రి పదవి కోసం ఎదురు చూస్తున్న రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెసు ముఖ్యనేత చిరంజీవికి ఈసారి ఖచ్చితంగా అవకాశం దక్కుతుందని కూడా వార్తలు వచ్చాయి. 28న ఖచ్చితంగా విస్తరణ జరిగిన పక్షంలో మన రాష్ట్రం నుండి మొదటి పేరు చిరంజీవిదే అన్నారు. ఇప్పటికే పలు ఖాళీలు ఉన్నందున విస్తరణ మాత్రం ఖచ్చితంగా జరుగుతుందని చెబుతున్నారు. చిరంజీవికి షిప్పింగ్ సహాయ మంత్రి పదవి ఇస్తారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అలాగే ఒకటో రెండో పదవులు తెలంగాణ ప్రాంత ఎంపీలకు ఇచ్చేందుకు అధిష్టానం యోచిస్తోందట.
అయితే తెలంగాణ ఉద్యమం ఉదృతం దాల్చుతున్న నేపథ్యంలో ఆ ప్రాంత ఎంపీలు పదవులు తీసుకుంటారా అనేది అసలు ప్రశ్న. అంతేకాకుండా ఆ ప్రాంతానికి చెందిన మంత్రులు, కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విప్లు వేర్వేరుగా అధిష్టానానికి తెలంగాణ ఇవ్వాల్సిందిగా లేఖలు రాశారు. తెలంగాణ కోసం ప్రయత్నాలు జరుగుతున్నప్పుడు పదవులు తీసుకుంటే ఆ విషయం వెనక్కి పోతుందని, తద్వారా పదవులు తీసుకున్న వారితో పాటు కాంగ్రెసుకు మరింత నష్టం జరుగుతుందని అందుకే వారు పదవులకు సుముఖత వ్యక్తం చేయక పోవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.