బాబుది అదే ధోరణి!: జూపూడి, బెయిల్కు అడ్డు.. పద్మ
తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి బెయిల్ రాకుండా అడ్డుకుంటున్న సిబిఐ.. అదే కేసులో నిందితులుగా ఉన్న మంత్రుల విషయంలో పూర్తిగా పక్షపాత వైఖరి ప్రదర్శించిందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ ధ్వజమెత్తారు. రాష్ట్ర మంత్రి ధర్మాన ప్రసాద రావు ఉదంతంతో సిబిఐ కుట్ర బహిర్గతమైందన్నారు. కీలక పదవుల్లో ఉన్న మంత్రి, ఐఏఎస్లకన్నా ఏ అధికార హోదా లేకుండా ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఏవిధంగా కేసును ప్రభావితం చేస్తారని సిబిఐ భావిస్తున్నదో ప్రజలకు చెప్పాలని నిలదీశారు.
వైయస్ అధికారంలో ఉండగా కొన్ని ఒప్పందాలు చట్ట వ్యతిరేకంగా జరిగాయని, వాటి కారణంగా జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టారనే ఆరోపణలపై సిబిఐ దర్యాప్తు చేపట్టిందని, సిబిఐ తన ఎఫ్ఐఆర్లో 26 జీవోలలో క్విడ్ ప్రో కో జరిగిందని ఆరోపిస్తూనే... ఎక్కడా అందుకు కారకులైన మంత్రులు, సెక్రటరీలను పేర్కొనలేదన్నారు. సుప్రీం కోర్టు నోటీసులు ఇవ్వడంతో గత్యంతరంలేక చార్జీషీట్లలో ఒకరిద్దరు మంత్రులు, కొందరు సెక్రటరీలను చేర్చిందని, సిబిఐ దాఖలు చేసిన నాలుగవ చార్జిషీట్లో నలుగురికి తప్ప మిగతా 24 మందికి బెయిల్ లభించిందన్నారు.
హైకోర్టు, సుప్రీంకోర్టులో జగన్ బెయిల్ పిటిషన్ విచారణకొచ్చిన ప్రతీసారి సాక్షుల్ని ప్రభావితం చేస్తారంటూ సిబిఐ అడ్డుపడుతోందని, ఎనిమిది సంవత్సరాలు మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి, 25 ఏళ్లుగా సర్వీస్ నిర్వహిస్తున్న సెక్రటరీలు ఎలాంటి ప్రభావితం చేయరా అని ప్రశ్నించారు. ఏనాడూ సచివాలయంలో అడుగు కూడా పెట్టని, ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఎలా ప్రభావితం చేస్తారన్నారు. అది కూడా ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన 280 రోజులకు అరెస్టు చేసి ఈ వాదన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సిబిఐ పక్షపాత వైఖరికి ఇదే ప్రత్యక్ష ఉదాహరణ అని అన్నారు. కేంద్రంలో కుంభకోణాలతో ప్రధానికి సంబంధంలేదని చెబుతూ.. రాష్ట్రంలో జారీ అయిన జీవోలకు దివంగత వైయస్ రాజశేఖరరెడ్డిని బాధ్యుణ్ని చేయడం అన్యాయమని పద్మ విమర్శించారు. చనిపోయిన వ్యక్తిని కూడా బాధ్యుల్ని చేస్తూ సిబిఐ ఎఫ్ఐఆర్లో పొందుపరచిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టిడిపి, సిబిఐ కుమ్మక్కై రాష్ట్రంలో మూడోపార్టీ లేకుండా చేయాలనే కుట్రలు చేస్తున్నాయన్నారు.