తెలంగాణపై వ్యాఖ్యకు సారి చెప్పిన వాయలార్ రవి

సమస్య పరిష్కారానికి ఇంకెంత సమయం పడుతుంది?
ఇక్కడేమీ జరగటం లేదు. (యూపీఏ ప్రభుత్వానికి) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మద్దతు ఉపసంహరించుకున్న అంశంతో అందరూ తీరిక లేకుండా ఉన్నారు. ఇంకా దానిపైనే ఉన్నాం. కొత్త అంశాన్ని చేపట్టలేదు.
తెలంగాణ మార్చ్ను విరమించాలని మీరు విజ్ఞప్తి చేస్తారా?
ఈ అంశం మనోభావాలతో కూడుకున్నది. దీనిని వారి విజ్ఞతకే వదిలేస్తున్నారు. వారు రాజకీయ వివేచన కూడా ఉపయోగించాలి. మార్చ్కు దూరంగా ఉంటేనే బాగుంటుంది. అయితే, దీనిపై నేను వాదించాలనుకోవటం లేదు. కేవలం ఒక మంచి భావంతో నేను విజ్ఞప్తి చేయగలను.
ఈ అంశాన్ని ఇంకెంతకాలం కొనసాగిస్తారు?
దీనిపై నేను ఎలా ఉందో అలా చెప్పలేను. కొంత కాలంగా దీనిపై ఎలాంటి చర్చలూ లేవు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న స్థితి సర్దుబాటు కావాల్సి ఉంది. అప్పటి వరకూ ఏమీ ఉండదు.
ఒకటి రెండు రోజుల్లో ఏమైనా ప్రకటన ఆశించవచ్చా?
నో బ్రదర్... ఇది సాధ్యం కాదు! నేను ఎలాంటి కాల పరిమితి చెప్పలేను. చాలా కష్టం.
ఈ సంక్షోభానికి ముగింపేమిటి?
ఇప్పటికే అందరికీ ఈ అంశం గురించి బాగా తెలుసు. ఇదేమీ కొత్త అంశం కాదు. కొత్త సమస్య కాదు. పార్లమెంటు సమావేశాల్లో ఇది చర్చకు వచ్చింది. దీనిపై చర్చలు జరిగాయి. ఎవరూ చర్చలను కొట్టిపారేయటం లేదు. అదే నేను స్పష్టం చేసేది.
యూపీఏ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీయే నడిపిస్తోంది. ఈ అంశంపై దృఢమైన నిర్ణయాలు తీసుకుంటుందా?
కాంగ్రెస్ అధిష్ఠానానికి ఈ సమస్య తెలుసు. కానీ, ఇంత వరకూ ఏ నిర్ణయమూ తీసుకోలేదు. దీనికి సమయం పడుతుంది. మధ్యలో సంక్షోభాలు వస్తున్నాయి. అందుకే ఇలా అవుతోంది. వారం రోజులుగా నేను ఎవరితోనూ మాట్లాడలేదు. ఆజాద్ సైతం ఇక్కడ లేరు. యూపీఏకు సంబంధించి ఇతర సమస్యలు అధిష్ఠానం చేతిలో ఉన్నాయి. ఇంతకు మించి ఎక్కువ నేనేమీ చెప్పను.
మీరు కేసీఆర్తో చర్చించారు కదా.. సమస్య పరిష్కారంలో దీన్నొక ముందడుగుగా భావించవచ్చా?
లేదు. మీరు మళ్లీ మళ్లీ.. ఈ దిశగా, ఆ దిశగా అని ప్రశ్నలడుగుతున్నారు. కేసీఆర్ మంగళవారం సాయంత్రం నన్ను కలవడం నిజమే. ఆయన ఇక్కడ ఉన్నారు. నేను ఈ (తెలంగాణ) అంశంపై మాట్లాడుతున్నా.
ఆయన పార్టీ కాంగ్రెస్లో విలీనానికి ప్రతిపాదిస్తోందన్న వార్తలు...
లేదు. నాకు తెలియదు. నిజంగా నాకు తెలియదు.
'తెలంగాణ... అదెక్కడుంది!' అని చేసిన వ్యాఖ్యలపై వయలార్ రవి క్షమాపణ చెప్పారు. మీడియా ప్రతినిధులు పదేపదే అడుగుతున్న ప్రశ్నలకు సరదాగా చేసిన వ్యాఖ్యలను సంచలనం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "నేను మీతో మాట్లాడినప్పుడు కాదు... మీరే వచ్చి నాతో మాట్లాడినప్పుడు... నేను చెప్పిన మాటలను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. మీరు నన్ను అక్కడా, ఇక్కడా, ప్రతి చోటా కలుస్తుంటారు. ప్రతిసారీ విడవకుండా తెలంగాణ గురించి అడుగుతున్నారు. దీంతో నేను మీతో జోక్ చేశాను. ఆంధ్రాతో నాకు 1960 నుంచి సంబంధముంది. తిరుపతిలో అప్పుడు జరిగిన పార్టీ సదస్సుకు హాజరయ్యాను. తర్వాత నేను తరచూ ఆంధ్రప్రదేశ్కు వెళుతుండేవాడిని. అప్పట్లో నేను ఫుట్బాల్ ఆడేవాడిని. మ్యాచ్లు ఉన్నప్పుడల్లా ఏపీ వెళ్లే వాడిని. కేరళకంటే ఆంధ్రాతోనే నాకు అనుబంధం ఎక్కువ. స్నేహితులు కూడా ఆంధ్రాలోనే ఎక్కువ. రాష్ట్ర ప్రజలను బాధపెట్టేలా నేను ఎలాంటి వ్యాఖ్యలూ చేయను" అని ఆయన అన్నారు.
"నా ఊహకు కూడా అందని విధంగా వార్తలు వచ్చాయి. కాబట్టి, నేను క్షమాపణలు చెబుతున్నాను. నేను వెళుతూవెళుతూ జోక్ చేసిన మాట వాస్తవం. అయితే... అదేమీ తప్పుడు ఉద్దేశంతో చేసింది కాదు. కొన్నిసార్లు ఏమీ లేదంటూ పంపించేస్తాను. తర్వాత ఆఫ్ ది రికార్డ్గా కూడా నేను తెలంగాణ స్థితి ఏంటో చెప్పాను. కాబట్టి, ఆం«ధప్రదేశ్ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు నేను స్పష్టం చేసేదొక్కటే.. ఎవరినైనా సరే బాధపట్టేలా, మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేయాలన్నది నా ఉద్దేశం కాదు. ఎవ రైనా బాధపడి ఉంటే నన్ను క్షమించండి'' అని ఆయన వివరణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications