తెలంగాణను ఎగతాళి చేస్తున్నారు: కాంగ్రెసుపై జవదేకర్
గురువారం పార్టీ ప్రవేశపెట్టబోయే రాజకీయతీర్మానంలో తెలంగాణ కూడా ఉంటుందని జవదేకర్ మీడియా ప్రతినిధులకు తెలిపారు. బీజేపీ తన హామీకి కట్టుబడి ఉంటుందని, ప్రభుత్వం పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెడితే తప్పకుండా మద్దతు ఇస్తుందన్నారు. ఒకవేళ ప్రభుత్వం బిల్లు పెట్టకుంటే తాము అధికారం చేపట్టగానే వందరోజుల్లో తెలంగాణను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఎక్కడ? అని ప్రశ్నించేంత వరకూ కాంగ్రెస్ పొగరుమోతుతనం పెరిగిందని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ఎగతాళి చేస్తున్న కాంగ్రెస్కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తెలంగాణ నాయకత్వం తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుది కాదని, బీజేపీయేనని జవదేకర్ అభిప్రాయపడ్డారు. గత 20 రోజులుగా ఢిల్లీలో కూర్చున్న కేసీఆర్ తీరుపై తాను వ్యాఖ్యానించబోనని, అయితే కాంగ్రెస్ను నమ్ముకున్నవారంతా నట్టేట మునగటం ఖాయమని స్పష్టం చేశారు. తనను నమ్ముకున్న వారిని మోసం చేయటం కాంగ్రెస్ నైజమని, ఆ పార్టీని నమ్ముకుని ఎవరూ సత్ఫలితాలు సాధించలేరని చెప్పారు.
'తెలంగాణనా.. ఎక్కడ!' అన్న వయలార్ వ్యాఖ్యలపై నాగర్కర్నూల్ ఎమ్మెల్యే నాగం జనార్దన్రెడ్డి మండిపడ్డారు. "హైదరాబాద్కు రా! తెలంగాణ ఎక్కడుందో చూపిస్తాం... అనవసర ప్రేలాపనలు మానుకో'' అని హెచ్చరించారు. భారత్కు స్వాతంత్య్రం వచ్చినప్పటికే హైదరాబాద్ ప్రత్యేక దేశంగా ఉందన్న విషయం ఆయనకు తెలియదా? అని ప్రశ్నించారు.
తెలంగాణ చరిత్ర గురించి తెలియని వయలార్కు కేంద్ర మంత్రివర్గంలో కొనసాగే హక్కులేదన్నారు. కాంగ్రెస్ భరతం పట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని... సోనియాను, ప్రధానిని హైదరాబాద్కు వచ్చి క్షమాపణ చెప్పేలా చేస్తామని హెచ్చరించారు. 'ఈ నెల 30న తెలంగాణ సత్తా చూపి స్తాం' అని స్పష్టం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ గురించి మంత్రులు శ్రీధర్బాబు, సబిత మాట్లాడుతున్నారని, హైదరాబాద్ కల్చర్ ఇంకెక్కడుందని ప్రశ్నించారు.