మళ్లీ నేనే సిఎం, పాలనను గాడిలో పెడతా: చంద్రబాబు
తమ పార్టీ అధికారంలోకి వస్తే, ముస్లిం మహిళలకు కెజి నుంచి పిజి వరకు ఉచిత విద్య అందించనున్నట్టు, ప్రత్యేక ఉర్దూ డిఎస్సి నిర్వహించనున్నట్టు తెలిపారు. ఐదు లక్షల రూపాయల వరకు వడ్డీ లేని రుణాన్ని అందిస్తామని, మహిళలకు వివిధ వృత్తుల్లో శిక్షణ ఇప్పించనున్నట్టు తెలిపారు. 62ఏళ్ల వయసులో తనకేమీ కోరికలు లేవని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలనే పాదయాత్ర చేయాలని నిర్ణయించనున్నట్టు తెలిపారు.
ప్రజలను చైతన్య పరిచేందుకే పాదయాత్ర అని, ఈ యాత్రతో చరిత్ర సృష్టిస్తానని అన్నారు. మైనారిటీల పరిస్థితి దయనీయంగా ఉందని, ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలనే ఆలోచన తొలుత తమ పార్టీదేనని అన్నారు.ఉర్దూ రెండవ భాషగా అమలు కావడానికి ఇతోధికంగా కృషి చేయనున్నట్టు తెలిపారు. మదర్సాలలో చదివే వారికి ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు.
ప్రతి జిల్లాలో ముస్లింలకు పదివేల ఇళ్ల నిర్మాణం చేయనున్నట్టు తెలిపారు. ఎన్టీఆర్ హెల్త్కార్డ్ ఏర్పాటుపై పార్టీలో చర్చిస్తున్నట్టు తెలిపారు. ముస్లింల స్థితిగతులపై సచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిటీలను ఏర్పాటు చేశారని, వారిచ్చిన నివేదికలను అమలు చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని విమర్శించారు.