జగన్ బెయిల్పై విచారణ: వాయిదా వేయించిన సిబిఐ
వాస్తవానికి ఈ పిటిషన్ పైన విచారణ సెప్టెంబర్ 14నే ఉంది. అయితే సిబిఐ కౌంటర్ను పరిశీలించాలని భావించిన సుప్రీం కోర్టు విచారణను ఈ రోజుకు(సెప్టెంబర్ 28)కి వాయిదా వేసింది. ఈ రోజు న్యాయవాదులు మారారని చెప్పి పరాశరణ్ విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో మరోసారి ఇది వాయిదా పడింది.
కాగా వైయస్సార్ కాంగ్రెసు అధ్యక్షుడు వైయస్ జగన్ అక్రమాస్తుల కేసులో తమ తరఫున వాదిస్తున్న సీనియర్ లాయర్ అశోక్ భానును తిరిగి సొంతం చేసుకుంది. ఈనెల 14న జగన్ బెయిల్ పిటిషన్ సుప్రీంకోర్టు విచారణకు సరిగ్గా ఒక రోజు ముందు కేంద్ర ప్రభుత్వం సీబీఐ న్యాయవాదులైన అదనపు సొలిసిటర్ జనరల్ హరేన్ రావల్, అశోక్ భానులను సీబీఐ పరిధి నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. వీరి స్థానంలో మోహినీ జైన్ను నియమించింది.
ప్రస్తుత జగన్ బెయిల్ పిటిషన్, విజయసాయి బెయిల్ రద్దు చేయాలంటూ సిబిఐ పిటిషన్లపై శుక్రవారం విచారణ జరగనుండగా అందుకు సరిగ్గా ఒక్కరోజు ముందే కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో సీబీఐ న్యాయవాదిగా అశోక్భానును తిరిగి నియమించింది. హరేన్ రావెల్ స్థానంలో ప్రముఖ న్యాయనిపుణుడు కె. పరాశరన్ కుమారుడు, మరో అదనపు సొలిసిటర్ జనరల్ మోహన్ పరాశరన్ను నియమించారు.
హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం, హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో కూడా జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ తరఫున తొలినుంచి అశోక్ భాను, రావల్ వాదిస్తున్నారు. ఎందుకో, ఏమిటో చెప్పకుండా వీరిని తప్పించడం పలు అనుమానాలకు దారితీసింది. మాజీ న్యాయశాఖ మంత్రి జోక్యం ద్వారానే ఈ మార్పు జరిగిందని సమాచారం. న్యాయవాదులను మార్చడం వల్ల కోర్టుల్లో కేసులు నీరుగారిపోతాయని సిబిఐ వాపోయింది.
కుండమార్పిడి కంపెనీలు, అల్లిబిల్లి లావాదేవీలతో ఆంధ్రప్రదేశ్ మొదలుకొని ఆరు దేశాల వరకూ పాకిన ఆర్థిక అవకతవకలను అర్థం చేసుకోవటం, వాటిని సమర్థంగా ప్రస్తావిస్తూ న్యాయస్థానాల్లో వాదించటం మామూలు లాయర్లకు సాధ్యం కాదని, పైగా ఇప్పుడు కొత్త న్యాయవాదులు వస్తే ఇవన్నీ వారు అర్థం చేసుకుని గట్టిగా వాదించేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోతుందని కేంద్ర పెద్దలకు వివరించింది. సీబీఐ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రెండు రోజులుగా ఢిల్లీలోనే ఉండి కేసు విషయంపై ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు.