30న శంకరన్న దీక్ష: ఈటెలకు ముఖ్యమంత్రి ఫోన్
ముఖ్యమంత్రితో మంత్రులు సమావేశమైనప్పుడే అదే విషయంపై డిజీపి మీడియా సమావేశం నిర్వహించడం ఏ మేరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రే డిజిపితో మాట్లాడించారని ఆయన విమర్శించారు. ఇది కచ్చితంగా తెలంగాణ మంత్రులను అవమానించడమేనని అన్నారు. ఇలాగే పదవుల్లో కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వారికి కనీసం డిపాజిట్లు కూడా దక్కవని శంకరరావు అన్నారు.
కాగా, తెలంగాణ కవాతుకు అనుమతి ఇచ్చే విషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్తో మాట్లాడారు. ఏ విధమైన అవాంఛనీయమైన సంఘటలు జరగవని తెలంగాణకు చెందిన మంత్రులు సంతకాలతో రాతపూర్వకమైన హామీ ఇస్తే తెలంగాణ కవాతుకు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈటెల రాజేందర్తో చెప్పినట్లు సమాచారం.
తెలంగాణ కవాతు ప్రశాంతంగా జరుగుతుందని, ఏ విధమైన హింసాత్మక సంఘటనలు జరగవని అంటున్నారు గానీ ఏదైనా జరగకూడని సంఘటన జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ముఖ్యమంత్రి అడిగినట్లు సమాచారం. అందుకు తెలంగాణ శాసనసభ్యులు బాధ్యత తీసుకుని రాతపూర్వకమైన హామీ ఇస్తారా అని ఆయన అడిగారు. రాతపూర్వకమైన హామీ ఇస్తేనే తెలంగాణ మార్చ్కు అనుమతి ఇచ్చే విషయాన్ని పరిశీలిస్తామని ఆయన చెప్పారు.