కవాతువేదిక రగడ: తగ్గని జెఏసి, అసెంబ్లీవద్ద వాగ్వాదం
అనంతరం కోదండరామ్ సహా పలువురు జెఏసి నేతలు అసెంబ్లీలోని టిఆర్ఎస్ఎల్పీకి వెళ్లేందుకు అక్కడకు చేరుకున్నారు. వారిని పోలీసులు లోనికి అనుమతించలేదు. తమ ప్రాంత ఎమ్మెల్యేలను కలుసుకునేందుకు కూడా తమకు హక్కు లేదా అని జెఏసి నేతలు పోలీసులను ప్రశ్నించారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఆ తర్వాత పోలీసులు జెఏసి నేతలను లోనికి అనుమతించారు. టిఆర్ఎస్ఎల్పీలో అఖిలపక్షం భేటీ అయింది. కవాతు వేదికను మార్చేది లేదని ప్రభుత్వానికి సూచించాలని ఈ భేటీలోనూ నిర్ణయించారు.
ఉద్యోగుల సత్తా చూపిస్తాం.. టిఎన్జీవో
ఈ నెల సెప్టెంబర్ 30వ తేదిన తెలంగాణ కవాతు పైన పోలీసు పవర్ చూపిస్తే మిగిలిన అన్ని శాఖలు ఉద్యోగుల చేతుల్లో ఉన్నాయని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు శ్రీనివాస్ గౌడ్, దేవి ప్రసాద్ అన్నారు. ఉద్యోగ సంఘాలు టిఎన్జీవో భవనంలో శుక్రవారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. తెలంగాణ కవాతుపై చర్చించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులపై నిర్బంధం విధిస్తే సమ్మె చేసే అవకాశం న్యాయపరంగా తమకు ఉంటుందన్నారు.
జై తెలంగాణ అన్న ఉద్యోగులను అరెస్టు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తా తాము అరెస్టు కావడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం కూడా మనలేదన్నారు. అక్రమ అరెస్టులు వెంటనే ఆపాలన్నారు. తెలంగాణ కవాతు సమయంలో ఉద్యోగులపై వేధింపులు, అరెస్టులకు దిగితే మెరుపు సమ్మెకు దిగుతామని ఉద్యోగ సంఘాల ఐక్యకార్యాచరణ సమితి హెచ్చరించింది.