కోదండరామ్ను తరిమికొట్టండి: సమైక్యాంధ్ర జెఎసి
తెలంగాణ మార్చ్కు అనుమతి ఇవ్వాలని కోరే ఎంపి, మంత్రులు ముందుగా తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మార్చ్ జరిగితే ట్యాంక్ బండ్పై ముందు వరుసలో కోదండరాం, కెసిఆర్, కెటిఆర్, హరీష్ రావు, కవిత తదితర తెరాస, జెఎసి నాయకులు, వారి కుటుంబ సభ్యులు ఉండాలన్నారు. సమైక్య వాదాన్ని వినిపించేందుకు సమైక్యాంధ్ర సంరక్షణ సమితి విజయవాడ ప్రకాశం బ్యారేజిపై ఈ నెల 30న తలపెట్టిన మార్చ్కు పోలీసులు అనుమతి నిరాకరించారు. శాంతి భద్రతలు, ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకొని సమైక్యాంధ్ర మార్చ్కు అనుమతి నిరాకరించినట్లు వెస్ట్ జోన్ ఏసీపీ టి.హరికృష్ణ తెలిపారు.
సమైక్యవాదుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందనటానికి ఈ నెల 30న తాము తలపెట్టిన సమైక్యాంధ్ర మార్చ్కు నగరంలో అనుమతి నిరాకరించడమే నిదర్శనమని సమైక్యాంధ్ర సంరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి నరహరిశెట్టి శ్రీహరి అన్నారు. ఈ విషయమై స్థానిక పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ జోక్యం చేసుకొని అనుమతి ఇప్పించేందుకు చొరవ చూపాలని కోరారు.
లేనిపక్షంలో నాలుగు రోజుల్లో తాము ఓ ప్రణాళికను రూపొందించి ప్రణాళికాబద్దంగా ఆందోళనలు చేపడతామని తెలిపారు. సమైక్యాంధ్ర ప్రాంతంలోని సమైక్యవాదులు వారి వారి ప్రాంతాల్లోని గాంధీ విగ్రహాలకు పూలమాల వేసి గాంధీ మార్గంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. దీంతో పాటు ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రులకు సమైక్యవాదులు ఉత్తరాలు రాయనున్నట్టు తెలిపారు.