రూ. 7.50 లక్షలు పలికిన బాలాపూర్ గణేశుడి లడ్డు
హైదరాబాద్ సమీపంలోని బాలాపూర్ గణేశుడి లడ్డు నిరుడు 5.45 లక్షల రూపాయలు పలికింది. ఈసారి లడ్డుకు పోటీ మరింత తీవ్రమైంది. వేలం పాటలో 18 మంది పోటీ పడ్డారు. శనివారం ఉదయం లడ్డు వేలం పాట ప్రారంభమైంది. వేలంపాటలో లక్షలు, వేలు పెరుగుతూ చివరికి లడ్డు ధర రూ.7.50 లక్షల రూపాయలు పలికింది.
బాలాపూర్ లడ్డు వేలం పాట అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. హైదరాబాదులోని ఖైరతాబాద్ విగ్రహం ఎత్తుకు ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటే బాలాపూర్ గణేశుడి లడ్డు వేలం పాటలో పలికే ధరతో ప్రాశస్త్యాన్ని సంతరించుకుంది. బాలాపూర్ గణేశుడి లడ్డు అత్యంత శుభప్రదమైందనే ప్రచారం సాగడంతో దాన్ని వేలంపాటలో పాడుకోవడానికి ఏ యేటికాయేడు పోటీ పెరుగుతూ వస్తోంది.
గణేశుడి లడ్డును వేలంపాటలో దక్కించుకునే వ్యక్తి దాన్ని పంట పొలాల్లో చల్లుతారని అంటారు. ఊరిలోని పొలాల్లో చల్లడం వల్ల గ్రామానికి కూడా శుభం కలుగుతోందని నమ్ముతారు. తన నాన్న చివరి కోరిక మేరకే లడ్డును వేలం పాటలో దక్కించుకున్నట్లు పన్నాల గోవర్ధన్ రెడ్డి చెప్పారు.