ఆజాద్తో గంటకు పైగా చర్చ: ఇక న్యూఢిల్లీలోనే కెసిఆర్
ఇటీవల కేంద్రమంత్రులు వాయలార్ రవి, అస్కార్ ఫెర్నాండేజ్లతో సాగిన చర్చలకు కొనసాగింపుగా ఆజాద్తో కెసిఆర్ కలిసినట్లుగా టిఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నారు. తెలంగాణ ప్రకటన, తెరాస విలీనం పైన వీరిద్దరి మధ్య చర్యకు వచ్చినట్లుగా భావిస్తున్నారు. అయితే ఢిల్లీలో ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణపై ప్రస్తుతం ముందడుగు వేయలేమని కెసిఆర్కు ఆజాద్ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.
పరిస్థితులు చక్కబడిన తర్వాత తెలంగాణపై చర్చలు మొదలు పెడతామని చెప్పారని తెలుస్తోంది. అక్టోబర్లో తేలుస్తామని ఆజాద్ చెప్పినట్లుగా సమాచారం. తెలంగాణ వచ్చే వరకు కెసిఆర్ ఢిల్లీలోనే ఉంటారని తెలంగాణ రాష్ట్ర సమితి నేత జితేందర్ రెడ్డి శనివారం చెప్పారు. ఆజాద్తో కెసిఆర్ భేటీ అవుతారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తెలంగాణ సమస్యను పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారని వార్తలొచ్చాయి. రాష్ట్ర వ్యవహారాల ప్రత్యేక పరిశీలకుడు వాయలార్ రవి ఇంతవరకు మూడుసార్లు కెసిఆర్తో చర్చలు జరిపారు. ఆస్కార్ ఫెర్నాండేజ్ ఒకసారి కెసిఆర్తో మంతనాలు సాగించారు.
ఇప్పుడు గులాం నబీ ఆజాద్తో భేటీ అయ్యారు. కెసిఆర్తో వాయలార్ ఇంతవరకు జరిపిన చర్చల ప్రక్రియను ఆజాద్ మరింత ముందుకు తీసుకు వెళ్లవచ్చు. జాతీయ సమస్యలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత తెలంగాణ అంశాన్ని ముందుకు తీసుకుని వెళ్తామని కాంగ్రెసు అధిష్టానం పెద్దలు కెసిఆర్కు చెప్పినట్లు సమాచారం. ఆస్కార్ ఫెర్నాండెజ్ కెసిఆర్కు అదే విషయం చెప్పినట్లు తెలుస్తోంది.