వస్తున్నానాకోసం: బాబుపై బొత్ససెటైర్, మంచిదే..రేణుక
ఆయన యాత్రను ప్రజలే పట్టించుకోవడం లేదని, తాము ఎందుకు పట్టించుకుంటామన్నారు. ఆయన యాత్రను అడ్డుకోవాల్సిన అవసరం కాంగ్రెసుకు ఎంతమాత్రమూ లేదన్నారు. కాంగ్రెసు సాధించిన ప్రగతి పైన ఎక్కడైనా చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. బాబు తీరు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లుగా ఉందని విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసమే ఆయన పాదయాత్ర చేపట్టారని, కానీ ప్రజలు ఆయనను నమ్మడం లేదన్నారు.
బాబుతో వేలెత్తి చూపించుకునే స్థితిలో తమ పార్టీ లేదన్నారు. వాన్ పిక్ కేసులో మిగతా వారిని ఎందుకు అరెస్టు చేయలేదన్న మాజీ మంత్రి మోపిదేవి వ్యాఖ్యలపై స్పందిస్తూ.. తాను ఆ వ్యాఖ్యలు చూడలేదని, చూసిన తర్వాత మాట్లాడతానని చెప్పారు. ముఖ్యమంత్రి విధానాల మీద తెలంగాణ ప్రాంత నేతలకు అసంతృప్తి లేదన్నారు. కేవలం తెలంగాణ అంశం మీదనే వారు మాట్లాడుతున్నారన్నారు. సీమాంధ్ర నేతలు కూడా వారి వారి ఆశయాల కోసం డిమాండ్ చేస్తున్నారని చెప్పారు.
ముఖ్యమంత్రిపై మంత్రులకు ఎలాంటి ఆవేదన, ఆందోళన లేదన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తెలంగాణపై అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ముఖ్యమంత్రిని విమర్శించవద్దని తాను కరీంనగర్ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, ఇతర నేతలకు సూచించానని చెప్పారు. తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఎవరైనా లేఖలు రాయవచ్చునని ఆయన చెప్పారు.
మంచిదే ఆరోగ్యకరం.. రేణుకా చౌదరి
చంద్రబాబు పాదయాత్ర పైన ఏఐసిసి అధికార ప్రతినిధి రేణుకా చౌదరి స్పందించారు. బాబు పాదయాత్ర ఆయనకు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందన్నారు. అలాంటప్పుడు మంచిదే కదా అన్నారు. యాత్ర ద్వారా రాజకీయంగా ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ముఖ్యమంత్రిని విమర్శించే ముందు ఎంపీలు తమ స్థాయిని తెలుసుకోవాలని ఆమె సూచించారు.