విస్తారంగా వర్షాలు: అరసవెల్లి స్వామిని తాకని కిరణాలు
తీరం వెంబడి గంటకు 45 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు బలంగా వీస్తున్నందువల్ల సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. హైదరాబాదు, కరీంనగర్, వరంగల్తో పాటు పలు జిల్లాల్లో భారీగ వర్షాలు కురిశాయి. రాజధానిలోని దమ్మాయిగూడెం, కీసర, ఈసిఐఎల్ క్రాస్ రోడ్డు, కుషాయిగూడ, ఎల్బీ నగర్, రామాంతాపూర్, ఖైరతాబాద్, కూకట్పల్లి, బంజారాహిల్స్ తదితర ప్రాంతాలలో వర్షం కురిసింది.
దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగింది. వరంగల్లో భారీ వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. పరకాలలో 1200 ఎకరాలలో పత్తి నీట మునిగింది. దీంతో రైతులు లబోదిబో అంటున్నారు. కరీంనగర్ జిల్లాలోని హుజురాబాద్, ఎల్కతుర్తి, సైదాపూర్ మండలాల్లో కుండపోత వర్షం కురిసింది. హుజురాబాదులో పిడుగు పడి పాడి ఆవులు మృతి చెందగా, వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
సూర్యనారాయణుడిని తాకని కిరణాలు
శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అరసవెల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి పాదాలను సూర్యుడి కిరణాలు మంగళవారం తాకలేదు. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు వేకువజామునుండే భక్తులు భారీగా ఆలయానికి చేరుకున్నారు. అయితే రాత్రి నుండి వర్షం పడి మేఘాలు దట్టంగా కమ్ముకోవడంతో భానుడు స్వామి వారి పాదాలను తాకలేదు.