బాబుకు అండ, కష్టంకాదు: హరికృష్ణ, సెంటిమెంట్.. గౌడ్
మేం స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్యకు రావడం లేదన్నారు. ప్రజల కోసమే వస్తున్నామని, వారు తప్పకుండా తెలుగుదేశం పార్టీని ఆశీర్వదిస్తారన్నారు. సంకల్పం ఉంటే 117 రోజుల యాత్ర కష్టమేమీ కాదన్నారు. నాడు తమ తండ్రి, స్వర్గీయ నందమూరి తారక రామారావు ప్రజలే దేవుళ్లు.. సమాజమే దేవాలయం అనే నినాదంతో వచ్చారని, తామంతా ఇప్పటికీ అదే దృక్పథంతో ముందుకు వెళుతున్నామని హరికృష్ణ చెప్పారు.
బాబు చేసేది రాజకీయ యాత్ర కాదని, ప్రజల కోసం చేస్తున్న యాత్ర అన్నారు. రాజకీయం కోసం యాత్రలు చేసే అలవాటు టిడిపికి లేదన్నారు. బాబు యాత్రకు తన పూర్తి సహకారం ఉంటుందని, అలాగే నందమూరి కుటుంబం మద్దతు ఉంటుందన్నారు. తనలాగే తన సోదరుడు బాలకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఏదో ఒక సమయంలో పాదయాత్రలో పాల్గొంటారన్నారు. హిందూపురం తమ కుటుంబానికి దేవాలయం వంటిదన్నారు.
హిందూపురం ప్రజలకు ఏ కష్టాలు ఉన్నా తాము స్పందిస్తామన్నారు. ఇది ప్రజలను మోటివేట్ చేసేందుకు చేసే యాత్ర అన్నారు. మంగళవారం కాబట్టి శుభప్రదమని, అయినా తమకు ఏ వారమైనా సంబంధం లేదని, ప్రజలే ముఖ్యమన్నారు. దేశాన్ని, రాష్ట్రాన్ని ఎవరు నాశనం చేశారో ప్రజలు చూస్తున్నారన్నారు. బాబు పాదయాత్ర విజయవంతం కావాలని హరికృష్ణ సోమవారం సూగురు ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
సెంటిమెంటుతో... దేవేందర్ గౌడ్
తమ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు ప్రాతినిథ్యం వహించిన హిందూపురం నియోజకవర్గం పైన ఉన్న సెంటిమెంట్ కారణంగానే ఇక్కడి నుండి పాదయాత్ర చేస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ అన్నారు. తెలంగాణ, రాయలసీమ, ఆంధ్ర అనే ప్రాంతాల వైరుధ్యాలను యాత్రతో ముడి పెట్టవద్దన్నారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడంపై స్పందిస్తూ... బాబు యాత్రను అడ్డుకుంటామని సీమాంధ్ర నేతలు మాత్రమే అంటున్నారని, ప్రజలు అనడం లేదన్నారు.
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి కాపీ యాత్ర కాదని, ఆయన కంటే ముందే టిడిపికి పాదయాత్ర చేసిన ఘనత ఉందన్నారు. అయినా వైయస్ పాదయాత్ర చేసినప్పుడు కాంగ్రెసు గెలవకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటానని చెప్పారని, అంటే అధికారం కోసం ఆన యాత్ర చేశారని, కానీ బాబు మాత్రం ప్రజల కోసం యాత్ర చేస్తున్నారన్నారు. ఆయన ఎప్పుడూ రాజకీయాల్లో ఉంటారన్నారు. తమకు హిందూపురం సెంటిమెంట్ ఉందన్నారు.
బాబు యాత్ర ధర్మ కార్యమని పలువురు నేతలు అన్నారు. తాము అధికారం కోసం యాత్ర చేయడం లేదన్నారు. జడ్జిలను, అధికారులను జైలుకు పంపిన ఘనత ఇతర పార్టీలదని, తమ హయాంలో చేసిన వారు ఉన్నత స్థానాల్లో ఉన్నారన్నారు. నందమూరి కుటుంబ సభ్యులు ఎప్పుడు వచ్చినా ఈ ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేస్తారన్నారు. కాగా బాబుకు స్వాగతం పలికేందుకు ఎర్రబెల్లి దయాకర రావు, కంభంపాటి రామ్మోహన్ రావు, సిఎం రమేష్ తదితరులు హిందూపురం చేరుకున్నారు.