బాపూఘాట్వద్ద కోదండ..అసెంబ్లీవద్ద శంకరన్న, జానాపై
ఈ సమయంలో మీడియా అడిగిన ప్రశ్నలకు కోదండరామ్ తాను మౌనదీక్షలో ఉన్నానని చెబుతూ గుచ్చి గుచ్చి ప్రశ్నించడంతో కొద్దిగా మాట్లాడారు. తాము శాంతియుతంగా ఉద్యమిస్తామన్నారు. సామాజిక ఉద్యమాలలో పోలీసులు హింసకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఉద్యమాన్ని అణిచి వేయాలని చూస్తే ఊరుకునేది లేదన్నారు. హింసా మార్గం మంచిది కాదన్నారు. ప్రభుత్వం కూడా జాతిపిత మహాత్మా గాంధీ సూచించిన అహింస దిశలో తమకు సహకరిస్తుందని ఆకాంక్షిస్తున్నామన్నారు.
సంపన్న వర్గాల కోసం తెలంగాణ ఉద్యమానికి ఢిల్లీ పెద్దలు తూట్లు పొడుస్తున్నారని విమర్శించారు. కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ప్రకటన శోచనీయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన కొందరి వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. తెలంగాణ సాధన కోసం గల్లీలో పోరాటాలు చేస్తూనే ఢిల్లీలో రాజకీయ చర్చలు జరపాల్సిందేనని కోదండరామ్ అన్నారు.
జానా రాజీనామా కోరే హక్కు ఉంది
పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానా రెడ్డి రాజీనామా కోరే హక్కు ప్రతి ఉద్యమకారుడికి ఉందని తెలంగాణ జెఏసి నేతలు విఠల్, శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మౌనదీక్షలో పాల్గొన్న వారు... జానా వ్యాఖ్యలను ఖండించారు. జెఏసి జానా ఇంట్లోనే ప్రారంభమైనప్పటికీ... ఆయన ఇప్పుడు జెఏసిలోకి ఎందుకు రావడం లేదో చెప్పాలని ప్రశ్నించారు. మంత్రుల రాజీనామా కోరే హక్కు ప్రతి తెలంగాణ ఉద్యమకారుడికి ఉందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులే నష్టపోయారన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ ప్రజాప్రతినిధులు మాత్రం పదవులు తెచ్చుకొని లాభపడ్డారని ఆరోపించారు. జెఏసి జానా ఇంట్లో పుట్టినంత మాత్రాన ఆయన చెప్పినట్లుగా నడుచుకోవాలనే నియమం ఏమీ లేదన్నారు. కాగా ఈ మౌన దీక్ష పదకొండు గంటల నుండి మధ్యాహ్నం ఒకటిన్నర వరకు ఉంటుందని కోదండరామ్ ప్రకటించారు. తెలంగాణ మార్చ్లో దౌర్జన్యానికి తెలంగాణవాదులు కారణం కాదని స్వామి గౌడ్ పేర్కొన్నారు.
అసెంబ్లీ గాంధీ విగ్రహం వద్ద శంకర రావు
మాజీ మంత్రి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర రావు అసెంబ్లీ ప్రాంగణంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మౌన దీక్ష చేపట్టారు. వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన ఈ దీక్షను చేపట్టారు.