జగన్ను అడ్డుకోలేదేం: తెలంగాణపై విహెచ్, వైఎస్ భ్రమ
వారి ఆస్తులు ఎవరూ తీసుకోరని.. తెలంగాణకు అడ్డుపడవద్దని వారికి విజ్ఞప్తి చేశారు. ఓబిసి పార్లమెంటరీ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు చెన్నైకు వచ్చిన ఆయన సోమవారం విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై త్వరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే రెండు ప్రాంతాలకూ మంచి జరుగుతుందని సూచించారు. తెలంగాణ కవాతు ఇంత విజయవంతమవుతుందని తాను ఊహించలేదని.. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజలు ఇంత భారీగా తరలి వచ్చారంటే ఇది నిజమైన ప్రజా ఉద్యమంగా అభివర్ణించారు.
దీని ద్వారా తెలంగాణ సెంటిమెంట్ ప్రజల మనస్సుల్లో ఎంతగా పాతుకుపోయిందో అర్థమవుతోందని.. అన్నదమ్ముల్లాగా విడిపోవాలన్నదే తమ అభిమతమని వీహెచ్ మరోసారి పునరుద్ఘాటించారు. తెలంగాణ కావాలని 2001లో ఢిల్లీలో మీటింగులు పెట్టినప్పుడుగానీ.. ఎన్నికల పొత్తు సమయంలోగానీ సమైక్యవాదులు ఎందుకు మాట్లాడలేదని.. సమైక్య సభలు ఎందుకు పెట్టలేదని వీహెచ్ ప్రశ్నించారు.
తెలంగాణ కోసం వందలాది మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి మనసులు కరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ మార్చ్ హింసాత్మకం కావడానికి పోలీసుల వైఖరే కారణమని విహెచ్ ఆరోపించారు. అనుమతి ఇచ్చిన తరువాత మళ్లీ ఆంక్షలు విధించడం సమంజసం కాదన్నారు. ఉస్మానియా విద్యార్థులను గేటు దగ్గరే ఆపేయడం తప్పని.. ఆ కారణంగానే విద్యార్థులు ఆవేశంగా ప్రవర్తించారని.. పోలీసుల జోక్యం లేకపోతే మార్చ్ ప్రశాంతంగా జరిగి ఉండేదన్నారు.
తెలంగాణ కవాతుకి దూరంగా ఉండడంపై ప్రశ్నించగా.. ఇటీవలే తనకు ఆపరేషన్ జరగడం, ఓబిసి పార్లమెంటరీ కమిటీ చైర్మన్ రాలేని పరిస్థితుల్లో యాక్టింగ్ చైర్మన్గా తాను బాధ్యతలు స్వీకరించడం వల్లే ఉద్యమానికి దూరంగా ఉండాల్సి వచ్చిందన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టనున్న యాత్ర గురించి ప్రస్తావిస్తూ.. గతంలో దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాదయాత్రతోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్న భ్రమతో.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ దుర్భర స్థితిని వినియోగించుకుని అధికారం సంపాదిచాలన్న లక్ష్యంతోనే బాబు యాత్రకు సంకల్పించారని విహెచ్ ఆరోపించారు.