కోదండ దిష్టిబొమ్మకు ఉరి: 'బాబు వివరణ ఇవ్వాలి'
అనంతరం మెయిన్ గేట్ ఎదుట అనంతపురం - చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించారు. ప్రత్యేక రాష్ట్రం సాధ్యం కాదని తెలిసినా దాన్ని వ్యాపారం చేసుకునేందుకే తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆ పార్టీ ఎమ్మెల్యేలు, తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరామ్ ఉద్యమాల పేరుతో అమాయకుల ప్రాణాలు బలిగొంటూ, జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారని వారు మండిపడ్డారు.
వేలాది విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు. హిందూపురం పట్టణంలోనూ ర్యాలీ సాగింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్కు ఇచ్చిన లేఖపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ కవాతులో విధ్వంసానికి పాల్పడటాన్ని మాజీ మంత్రి, జై ఆంధ్రా ఉద్యమ నాయకుడు వసంత నాగేశ్వర రావు తీవ్రంగా ఖండించారు. అన్నదమ్ముల్లా విడిపోవాలే గానీ ఆస్తులకు నష్టం కలిగించటం, మీడియాపై దాడులు చేయటం మంచి పద్ధతి కాదన్నారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలోనూ సమైక్యవాదులు ఆందోళనకు దిగారు. శాంతియుతంగా మార్చ్ చేస్తామన్న తెలంగాణ జెఏసి కన్వీనర్ కోదండరాం మాట తప్పి.. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తు ధ్వంసానికి ప్రోత్సహించారని ఆరోపించారు. దీనికి నిరసనగా ఆయన దిష్టిబొమ్మను ఉరితీశారు. ఆయనపై దేశ ద్రోహ నేరం మోపి కేసు పెట్టాలని సాప్స్ నేత రాజా రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో ఐకాస ఆధ్వర్యాన ప్రదర్శన నిర్వహించారు.
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో సమైక్యాంధ్రకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. శాంతియుతంగా కవాతు చేస్తామని తెలంగాణవాదులు మాట తప్పారని విశాఖలో సమైక్యవాదులు ఆరోపించారు. సమైక్యాంధ్ర ప్రజా పోరాట సమితి రాష్ట్ర కన్వీనర్ నారాయణరావు, ప్రభుత్వ విప్ డి.శ్రీనివాస్, విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడారు.