శోభపై సీతక్క ఫైర్: వందకార్లతో కాన్వాయ్, వెంట లోకేష్
అలాంటి పార్టీని సీమాంధ్ర ప్రజలు అడ్డుకోవద్దని కోరారు. టిడిపిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి పైన ఉందన్నారు. రాజ్యాధికారం బడుగులకు అప్పగించిన ఘనత టిడిపిదే అన్నారు. బాబు యాత్రను రాజకీయ పార్టీలు, నేతలు మాత్రమే అడ్డుకుంటారన్నారు. అలనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు రాముడి పాలన అందించారని, ఆ తర్వాత బాబు అందించారని, మరోసారి బాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు.
బాబుపై ఇప్పుడు విమర్శలు చేస్తున్న శోభా నాగి రెడ్డి, సి.రామచంద్రయ్యలు టిడిపి అధికారంలో ఉన్నప్పుడు పాలన సరిగా లేదని ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. అధికారంలో ఉండగా పదవులు అనుభవించిన వారు ఇప్పుడు అధికారం దూరం కాగానే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బాబుపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సి.రామచంద్రయ్య చిత్తూరు, శోభ కర్నూలు నుండి హైదరాబాద్ వరకు ముక్కు నేలకు రాయాలన్నారు.
మంగళవారం మంగళ ప్రదమైన రోజని, హనుమంతుని దినమని, పాదయాత్ర విజయవంతమవుతుందని నేతలు అన్నారు. పాదయాత్రలో అందరూ పాల్గొంటారన్నారు. బాబు కోసం ఎదురు చూస్తున్నామని భారీగా తరలి వచ్చిన వారు అన్నారు. బాబుకు అండగా ఉంటామన్నారు. ఆయన యాత్రలో పాల్గొంటామని, తెలుగుదేశం పార్టీని అధికారం కోసం తీసుకు వచ్చే వరకు ప్రజా సమస్యలపై పోరాటం చేస్తామన్నారు.
అంతకుముందు...
చంద్రబాబు ఉదయం తన ఇంటి నుండి సికింద్రాబాదులోని ఎంజి రోడ్డుకు చేరుకొని అక్కడ మహాత్మా గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. అక్కడి నుండి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకొని స్వర్గీయ నందమూరి తారక రామారావుకు నివాళులు అర్పించారు. అటు నుండి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుని, అక్కడి నుండి బెంగళూరుకు చేరుకున్నారు. బెంగళూరులోని ఓ రిసార్ట్ నుండి దాదాపు వంద కార్లతో కూడిన కాన్వాయ్తో బాబు హిందూపురం బయలుదేరారు. బాబుతో పాటు తనయుడు లోకేష్, దేవినేని ఉమామహేశ్వర రావు, వల్లభనేని వంశీ ఉన్నారు.