సస్పెన్స్కు తెర: '14లో జగన్తో ఢీకి లోకేష్ సిద్ధం!
తాను రాజకీయాల్లోకి వచ్చేందుకు ఎవరి అనుమతి అవసరం లేదని, 1995 నుండి రాజకీయాల్లో ఉన్నానని, 2009 నుండి క్రియాశీలకంగా మారానని లోకేష్ చెప్పుకొచ్చారు. ఇన్నాళ్లుగా లోకేష్ రాజకీయ ఆరంగేట్రం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న వారికి అతను మాత్రం తాను కొత్తగా రాజకీయాల్లోకి రావడమేమన్నట్లుగా మాట్లాడారు. ఇక వచ్చే సాధారణ ఎన్నికలలో ఎక్కడి నుండి పోటీ చేస్తారనేదే ప్రధాన అంశంగా మారినట్లుగా కనిపిస్తోంది.
లోకేష్ వ్యాఖ్యలతో కొత్త ఉత్సాహం
తాను రాజకీయాల్లోనే ఉన్నానని చేసిన లోకేష్ వ్యాఖ్యలతో టిడిపిలో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. 2014లో తమ యువనేత పోటీ చేస్తారని వారు భావిస్తున్నారు. ఇప్పటికే హీరో బాలకృష్ణ పోటీ చేస్తానని ప్రకటించారు. ఆ తర్వాత రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ తన అసంతృప్తిని వీడి బావ బాబుకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. తాజాగా లోకేష్ ప్రకటన. ఇవన్నీ చూస్తుంటే తమ పార్టీకి శుభ ఘడియలు ప్రారంభమైనట్లేనని తెలుగు తమ్ముళ్లు ఉబ్బితబ్బిబ్బవుతున్నారు.
బాలకృష్ణకు మాస్ ఫాలోయింగా బాగానే ఉంది. అయితే కొత్తతరాన్ని ప్రభావితం చేయాలంటే మరో యువనేత అవసరం టిడిపికి ఉందని తెలుగు తమ్ముళ్లు భావించారు. బాలయ్యకు లోకేష్ తోడయితే తమను ఎవరూ ఆపలేరని వారు గట్టిగా విశ్వసిస్తున్నారు. లోకేష్తో ఆ కొరత తీరిందని చెబుతున్నారు. వైయస్ జగన్ యువనేత కావడంతో ఆయన వైపు యూత్ బాగా ఆకర్షితులవుతున్నారు. టిడిపికి ఇప్పుడు లోకేష్ రూపంలో ప్రత్యామ్నాయం దొరికింది. దీంతో జగన్కు ధీటుగా యువతను లోకేష్ ఆకర్షించగలరని టిడిపి క్యాడర్ భావిస్తోంది.
లోకేష్కు ఆవేశం లేదని, పైగా ఆలోచనపరుడని అంటున్నారు. విపక్షాలపై విమర్శలు చేసినా, వారి విమర్శలు ధీటుగా తిప్పి కొట్టాలన్నా, పార్టీని పటిష్ట పర్చాలన్నా వ్యూహాత్మకంగా వ్యవహరించగలరని భావిస్తున్నారు. అందుకు వారు రెండు మూడు ఉదాహరణలు కూడా చూపిస్తున్నారు. 2009 సాధారణ ఎన్నికల సమయంలో టిడిపి నగదు బదలీ పథకం సెన్షేషన్ క్రియేట్ చేసింది. ఆ పథకానికి రచన చేసింది లోకేష్ అని టిడిపి వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ఓ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ.. కేవలం టిడిపి గురించి మాత్రమే ప్రస్తావించారు. జగన్ పార్టీ గురించి మీడియా గుచ్చి గుచ్చి ప్రశ్నించినా ఇతర పార్టీల గురించి తాను మాట్లాడనని చెప్పారు. కాంగ్రెసు పార్టీనీ ఎక్కడా విమర్శించలేదు. కేవలం టిడిపి గురించి మాత్రమే మాట్లాడారు. కానీ ఇప్పుడు తాను ఎప్పటి నుండో రాజకీయాల్లో ఉన్నానని ప్రకటిస్తూ.. కాంగ్రెసుపై విమర్శలు చేశారు.